కైవ్: ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలు యుద్ధ వినాస్యాలను ప్రదర్శించడం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
మంగళవారం ఉదయం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విద్యార్థులు, పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రత కోసం ఉక్రెయిన్లో ఉన్న కైవ్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఓ సలహాను జారీ చేసింది. ఉక్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు తాత్కాలికంగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొంది. ఆన్లైన్ క్లాసుల్లో నమోదుకు సంబంధించి వారి కళాశాలల నుండి నిర్ధారణ కోసం వేచి ఉండవద్దని కోరింది. అంతకు ముందు ఉక్రెయిన్లోని వైద్య విశ్వవిద్యాలయాల నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఎంబసీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించేందకు కేంద్రం మంగళవారం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపించింది. ఈ విమానాలు ఈరోజు రాత్రికి స్వదేశానికి చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
ADVISORY TO INDIAN STUDENTS IN UKRAINE.@MEAIndia @PIB_India @IndianDiplomacy @DDNewslive @PTI_News @IndiainUkraine pic.twitter.com/7pzFndaJpl
— India in Ukraine (@IndiainUkraine) February 22, 2022

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
