ప్రపంచానికి చమురు, ఇంధనం ఎగుమతి చేసే దిగ్గజం.. ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. జనాలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. స్వదేశీ అవసరాలు తీర్చుకునేందుకు భారత్ను ఆశ్రయించే పరిస్థితికి చేరింది!. ఇది ప్రపంచ ఇంధన సమీకరణాల్లో అసాధారణ మార్పుగా కనిపిస్తోంది!.
ఉక్రెయిన్ గత కొద్ది నెలలుగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా అనేక రిఫైనరీల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా రష్యా వ్యాప్తంగా పెట్రోల్ కొరత, రేషన్ విధానం, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, ధరల పెరుగుదల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరా కోసం భారత్ వైపు మళ్లింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు సముద్ర మార్గంలో చేరింది. మరో రెండు ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30–40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సరఫరా ఏ భారతీయ రిఫైనరీ నుంచి వెళ్తోందన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ భారీగా ఉంటుంది. రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నెలకు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఇప్పటికే బెలారస్ కూడా రష్యాకు సహాయక సరఫరాలు పెంచింది. జూన్ మొదటి భాగంలోనే బెలారస్ నుంచి రైలుమార్గంలో 70 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెట్రోల్ రష్యాకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు భారత్–రష్యా ఇంధన వాణిజ్యం మాత్రం గత కొన్నినెలల్లోనే మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధం.. పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ధరల ఒత్తిడుల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తోంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, భారత్ తన ఇంధన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగించింది. భారత రిఫైనరీలు ఈ చమురును శుద్ధి చేసి దేశీయ అవసరాలకే కాకుండా ఇతర మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బంధం మరింత బలపడింది.
ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరతను అంగీకరించారు. ఉక్రెయిన్ దాడుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడులు రష్యా సైనిక కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని స్పష్టం చేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ కోసం వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
మరోవైపు భారత్–రష్యా మధ్య ఇంధన వాణిజ్యం గత కొద్ది నెలల్లో మరింత బలపడింది. హర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురు దిగుమతి చేసింది. తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత రిఫైనరీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సరఫరా చైన్ కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది.
ఇలా ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్పై ఆధారపడే పరిస్థితికి చేరడం అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ ప్రభావాలు, ఇంధన మార్కెట్ మార్పులపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది యుద్ధం తెచ్చిన ఆర్థిక సమీకరణాల “సీన్ రివర్స్” ఉదాహరణగా నిలుస్తోంది. అదే సమయంలో సంక్షోభ సమయంలో భాగస్వామ్య దేశానికి అండగా నిలుస్తూ భారత్ తన మిత్రధర్మాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


