పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బిగ్‌ షాక్‌ | Imran Khan Loses Another Ally Before Crucial No Confidence Motion | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌ పాలిటిక్స్‌లో ట్విస్టులు.. ఇమ్రాన్‌కు బిగ్‌ షాక్‌

Mar 27 2022 7:19 PM | Updated on Mar 27 2022 7:26 PM

Imran Khan Loses Another Ally Before Crucial No Confidence Motion - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై రేపు అవిశ్వాస తీర్మానం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్‌ పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. సోమవారం పాక్‌ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) మిత్రపక్షం జమూరీ వతన్‌ పార్టీ నేత షాజైన్‌ బుగ్తీ.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్షమైన పాక్‌ డెమోక్రటిక్ మూవ్‌మెంట్‌లో చేరారు. ఈ సందర్భంగా బుగ్తీ ట్విట్టర్‌ వేదికగా సంచలన కామెంట్స్‌ చేశారు. పాక్‌, బలూచిస్థాన్‌ ప్రజల ప్రయోజనాల కోసం, మంచి భవిష్యత్‌ కోసం తాను ప్రతిపక్షంలో చేరానన్నారు. ఇమ్రాన్‌ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో శాంతిభద్రతను మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. 

ఇదిలా ఉండగా.. అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఒక్క‌సారిగా అదృశ్యమయ్యారు. వారి జాడ తెలియ‌డం లేదంటూ పాకిస్థాన్ మీడియా వెల్ల‌డించింది. తప్పిపోయిన మంత్రుల్లో 25 మంది ఫెడరల్, ప్రావిన్షియల్ అడ్వైజర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. 

ఇక, పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 172 మంది జాతీయ అసెంబ్లీ సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాగా ఇమ్రాన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ నుంచి 155 మంది సభ్యులు ఉండగా.. నాలుగు ప్రధాన మిత్రపక్షాల నుంచి 20 మంది సభ్యులను కలిగి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement