వియత్నాంలో పిల్లి మాంసం ముఠా గుట్టురట్టైంది. పెంపుడు పిల్లులను దొంగిలించి మాంసంగా విక్రయిస్తున్న తొమ్మిది మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లో 400కుపైగా సజీవ పిల్లులను రక్షించారు.
పోలీసుల కథనం ప్రకారం.. టే నిన్హ్ ఫ్రావిన్స్, హో ఛి మిన్హ్ నగరాల్లో పలు ప్రాంతాలపై దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. దాడుల్లో 400కుపైగా సజీవ పిల్లులతో పాటు ఐస్లో నిల్వ ఉంచిన సుమారు 80 చనిపోయిన పిల్లులను స్వాధీనం చేసుకున్నారు. మరో కేంద్రంలో అదనంగా 21 పిల్లులను కూడా రక్షించారు.
రక్షించిన పిల్లుల్లో 40కుపైగా తమ యజమానుల వద్దకు చేరాయి. అయితే నిర్బంధ పరిస్థితుల కారణంగా కొన్ని పిల్లులు తర్వాత మరణించినట్లు జంతు సంక్షేమ సంస్థ వెల్లడించింది.
వియత్నాంలో కుక్క, పిల్లి మాంసం వినియోగం చట్టబద్ధమే అయినప్పటికీ, జంతువుల మూలాన్ని నిర్ధారించే అనుమతులు తప్పనిసరి. అయితే ఈ ముఠా పెంపుడు జంతువులను అక్రమంగా దొంగిలించి విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
జంతు సంక్షేమ సంస్థల అంచనాల ప్రకారం, వియత్నాంలో ప్రతి ఏడాది సుమారు 50 లక్షల కుక్కలు, 10 లక్షల పిల్లులు మాంసం కోసం పట్టుబడి, అక్రమ రవాణాకు గురవుతున్నాయి.


