
గాజా యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతున్న వేళ.. ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుంది. ప్రతీకారంతో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేసింది.
ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్లోని కమతియే పట్టణంపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహామొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రతీకారంగా, హెజ్బొల్లా సోమవారం ఉదయం ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఫలితంగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. హెజ్బొల్లా హైఫా నగరంలో దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1 మిసైల్స్తో బీభత్సం సృష్టించింది.
మిసైల్ దాడులతో స్థానికంగా ఉన్న భవనాలు, ఇతర సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. గాయపడ్డ క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.