breaking news
Haifa
-
ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు
గాజా యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతున్న వేళ.. ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుంది. ప్రతీకారంతో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్లోని కమతియే పట్టణంపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహామొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రతీకారంగా, హెజ్బొల్లా సోమవారం ఉదయం ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఫలితంగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. హెజ్బొల్లా హైఫా నగరంలో దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1 మిసైల్స్తో బీభత్సం సృష్టించింది.మిసైల్ దాడులతో స్థానికంగా ఉన్న భవనాలు, ఇతర సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. గాయపడ్డ క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
మ్యూజియం మళ్లీ పిలిచింది
ఇజ్రాయెల్లో ఓ మ్యూజియంలో ఇటీవల 3,500 ఏళ్ల నాటి మట్టి కూజాను పొరపాటున కింద పడేసిన నాలుగేళ్ల ఏరియల్ గెలర్ గుర్తున్నాడా? అంతటి పురాతన కూజాను పగలగొట్టినా మ్యూజియం సిబ్బంది ఆ బాలున్ని కనీసం తిట్టకపోవడం, గాభరా పడ్డ అతని తల్లిదండ్రులను ‘మరేం పర్లేదం’టూ కూల్ చేసి అందరి మనసూ గెలుచుకోవడం తెలిసిందే. అంతేగాక మ్యూజియం చీఫ్ స్వయంగా దగ్గరుండి మరీ ఆ చిన్నారికి అన్ని వస్తువులనూ తిప్పి చూపించారు. ఈ సంఘటన దక్షిణ ఇజ్రాయెల్లోని హైఫా యూనివర్సిటీలో హెక్ట్ మ్యూజియంను 10 రోజుల క్రితం జరిగింది. అయితే కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను బాలుడు సరిగా చూడలేదని భావించిన సిబ్బంది అతన్ని మరోసారి ఆహా్వనించారు. ఆ మేరకు ఏరియల్ గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు వెళ్లి సందర్శించాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను వెంట తీసుకెళ్లి మ్యూజియానికి ప్రత్యేకంగా బహూకరించాడు! దాని వెనక దాగున్న ఆ పసిహృదయపు మనోభావాలను గౌరవిస్తూ సిబ్బంది దాన్ని ఆనందంగా స్వీకరించారు. మ్యూజియం క్యూరేటర్లు బాలునితో చాలాసేపటిదాకా గడిపారు. ఇలా పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో అతనికి ప్రత్యక్షంగా చూపించారు. సిబ్బందికి హేట్సాఫ్: తల్లిదండ్రులు మ్యూజియం వర్గాలకు ఏరియల్ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేముండే ప్రాంతం లెబనాన్కు అతి సమీపంలో ఉంటుంది. నిత్యం బాంబు దాడులే. ఆ ఆందోళనల నుంచి కాస్త ఊరట కోసం 10 రోజుల కింద మ్యూజియానికి వెళ్తే అనుకోకుండా ఇలా జరిగింది. దాంతో మా పని అయిపోయిందనుకున్నాం. దానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యాం. కానీ మ్యూజియం సిబ్బంది మా వాడిని గానీ, మమ్మల్ని గానీ ఆ రోజు పల్లెత్తు మాట కూడా అన్లేదు. వాస్తవానికి నరకప్రాయంగా మారాల్సిన ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారు’’అంటూ ఆనందం వెలిబుచ్చారు. ఈ మొత్తం ఉదంతం బాలల్లో చరిత్ర పట్ల ఉత్సుకత, ఆసక్తి రేకెత్తిస్తే తమకు అంతకంటే కావాల్సిందేమీ లేదని మ్యూజియం డైరెక్టర్ ఇనబల్ రివ్లిన్ అన్నారు. ఏరియల్ మ్యూజియం పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్గా మారింది. అందుబాటులోనే ఉండాలి! పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారు. వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుని మళ్లీ ప్రదర్శనకు అందుబాటులోకి వస్తుందని రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ తెలిపారు. ‘‘ఇలాంటి పురాతన వస్తువులు సందర్శనకు వచ్చేవారికి చేతికందేంత సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?!’’ అని ఆయన అభిప్రాయపడటం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరబ్ భూమిలో ఆ ఇద్దరు!
ఆ ఇద్దరి శక్తిసామర్థ్యాలను ప్రశంసించడానికి లేదా గుర్తు తెచ్చుకోవడానికి ‘లీడింగ్ గ్లోబల్ థింకర్స్’ జాబితా ఒక కారణం అయితే కావచ్చు గానీ, అది మాత్రమే ప్రమాణం కాదు. విజయపథం వైపు వారి ప్రయాణానికి అది మాత్రమే కొలమానం కాదు. హైఫా, నౌర అనే ఇద్దరు మహిళలు... ఏ అమెరికాలోనో, బ్రిటన్లోనో పుట్టి విజయాలు సాధించి ఉంటే పెద్దగా చెప్పుకునే వాళ్లం కాదేమో. కానీ వాళ్లు విజయాలు సాధించింది, మహిళలు విజయాలు సాధించడానికి అంతగా అనుకూలం కాని అరబ్ భూమిలో! అంతర్జాతీయ కీర్తి ముందు హైఫా గురించి. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం. సినిమా డెరైక్టర్ కావాలనేది ఆశయం. ఆడపిల్లలు సినిమాలు చూడడమే అనైతికం అని భావించే సౌదీలో... ఒక ఆడపిల్ల సినిమా డెరైక్టర్ కావాలనుకోవడానికి చాలా ధైర్యమే ఉండాలి. అది హైఫాలో ఉంది. ఆమె తండ్రి కవి. బహుశా ఆయన స్వతంత్ర భావాలే కూతురుకీ వచ్చి ఉంటాయి. హైఫా ఎలాంటి నియమ నిబంధనల మధ్యా పెరగలేదు. 2009లో ‘యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ’ లో డెరైక్టింగ్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ సాధించించి సినిమా ఎలా తీయాలో తెలుసుకున్నారు హైఫా. అంతేకాదు... ‘వా-జె-ద’ రూపంలో తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. మరి డబ్బులు కావాలి కదా! మధ్యప్రాచ్యంలో ప్రతి కళాసంస్థకు, యూరప్లోని ప్రతి ప్రొడక్షన్ కంపెనీకి ఆర్థిక సహాయం కోసం ఈ-మెయిల్స్ పంపారు హైఫా. అనేక ప్రయత్నాల తరువాత, అవమానాల తరువాత ఆమె ప్రయత్నం ఫలించింది. ‘వా-జె-ద’ షూటింగ్ మొదలైంది. షూటింగ్ జరిపే క్రమంలో సహజంగానే ఆమెకు రకరకాల అవాంతరాలు ఎదురయ్యాయి. కొందరైతే తమ ఇంటి పరిసరాల్లో షూటింగ్ చేయడానికి ససేమిరా అన్నారు. ‘‘సౌదీ అరేబియాలో షూటింగ్ చేయడం అనేది చట్టవ్యతిరేకం కాదు. ఎందుకంటే అక్కడ చట్టం అంటూ ఉంటే కదా’’ అంటారు హైఫా వ్యంగ్యంగా. అంతమాత్రాన ఆమె సౌదీ ప్రజలకు వ్యతిరేకం ఏమీ కాదు. ‘‘సౌదీయులకు హస్యచతురత ఎక్కువ. అది ప్రతి మాటలోనూ కనిపిస్తుంది’’ అంటారు ఆమె. ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లను కూడా గుర్తుకు తెచ్చుకొని అందులోని చమత్కారానికి నవ్వుకుంటారు హైఫా. సౌదీ అరేబియాలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం ‘వా-జె-ద’. సైకిల్ తొక్కడానికి అనుమతి లేని దేశంలో ఒక బాలిక సైకిల్ కొనడానికి పడిన పాట్లు ఈ సినిమాలో గొప్పగా చూపారు. ‘వా-జె-ద’ ఆస్కార్కు కూడా నామినేట్ అయింది. ఇప్పుడు సౌదీలో ఆమె భావాలకు నిశ్శబ్దంగా మద్దతు లభిస్తోంది. చిత్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. సౌదీ తొలి మహిళా డెరైక్టర్ హైఫా గ్లోబల్ థింకర్గా నిలిచారు. ఇప్పుడు ఆ దేశంలో మరెందరో హైఫాలు తయారుకావడానికి ఒక కొత్త దారి ఏర్పడింది. కళకు పునరుజ్జీవనం ఇక నౌరా గురించి. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఎ.ఇ.)లో సృజనాత్మక రంగాన్నీ, వేదికలను ఒంటి చేత్తో నిలిపిన ఘనత ఆమెది. యు.ఎ.ఇ.లో 1980 దశాబ్దారంభం ప్రాంతీయ నాటకాలకు బంగారు కాలం. కానీ... కాలం గడుస్తున్న కొద్దీ అక్కడ నాటకం కొడిగట్టింది. రీజనల్ డ్రామా మార్కెట్టుకు గడ్డుకాలం దాపురించింది. ఈ క్రమంలో... ‘ఎందుకిలా జరిగింది’ అనే ప్రశ్న నౌరాను తరచు వేధించసాగేది. లండన్ బిజినెస్ స్కూలులో చదువుకున్న నౌరా యు.ఎ.ఇ. గవర్నమెంట్ గ్యాస్ కంపెనీ ‘డాల్ఫిన్ ఎనర్జీ’లో మేనెజ్మెంట్ విభాగంలో చేరారు. ఉన్నత ఉద్యోగం... కానీ, ఎక్కడో అసంతృప్తి. తనకు ఇష్టమైన అభిరుచులు... ఫొటోగ్రఫీ, పుస్తకాలు, రచన... ఆమెను ఒక దగ్గర నిలవనివ్వలేదు. 2007లో రెండువందల పేజీల ఒక డాక్యుమెంట్ను చదవడం ద్వారా ఆమె అసంతృప్తికి పరిష్కారం దొరికింది. అది ‘టూఫోర్54’ అనే ఫ్రీ మీడియా సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్. ఆ సంస్థ తొలి సీఇవోగా ఎంపిక కావడం ద్వారా తన కోరికను నెరవేర్చుకున్నారు నౌరా. ‘టుఫోర్54’ అనేది టెలివిజన్, రేడియో, ఫిల్మ్, పబ్లిషింగ్, ఆన్లైన్, మ్యూజిక్, గేమింగ్, యానిమేషన్ విభాగాల అభివృద్ధికి పని చేసే ప్రభుత్వ సంస్థ. అది వర్క్షాపులు నడపడమే కాకుండా అవసరమైన చోట సబ్సిడీలు కూడా ఇస్తుంటుంది. ‘‘ఒక అరుదైన ప్రాజెక్ట్కు ఆడపిల్ల సిఇవో కావడం ఏమిటి? ఆ పోస్ట్కు మగవాళ్లు మాత్రమే సరిపోతారు. అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలు దూసుకోపోలేరు’’ అనుకుంది అక్కడి పురుషాధిక్యసమాజం. అయినా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది నౌరా. అయిదేళ్లలో ఆ దేశంలో ‘క్రియేటివ్ బిజినెస్’ను కొత్తపుంతలు తొక్కించింది. ‘టుఫోర్54’ పక్కా బిజినెస్లాగే అనిపించినా దానిలో కళాపునరుజ్జీవం ఉంది. ‘సృజనాత్మక వ్యక్తీకరణ లేకుండా యు.ఎ.ఇ. ఎప్పటికీ సుసంపన్నమైన సాంస్కృతిక వికాసానికి చేరుకోదు’ అనే వాస్తవాన్ని నమ్ముతుందామె. ఆ నమ్మకానికి నౌరా ఆధ్వర్యంలోని ‘టుఫోర్54’ ఒక నిదర్శనంలా నిలుస్తోంది.