ముంచుకొస్తున్న ముప్పు | Glacier melt in the Himalayas endangers South Asia | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు

May 31 2025 4:32 AM | Updated on May 31 2025 4:32 AM

Glacier melt in the Himalayas endangers South Asia

ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు 

మరో 2 డిగ్రీలు పెరిగితేహిందూకుష్‌లో 75 శాతం మంచు మాయం 

ఆసియాలో 200 కోట్ల మంది మనుగడకు ప్రమాదం 

10 దేశాల సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి 

గ్లేసియర్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలంటున్న పర్యావరణ నిపుణులు

న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్‌ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్‌) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్‌ గ్లేసియర్స్‌ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 

పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్‌కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్‌ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

→ 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్‌ మోడల్స్‌ ఉపయోగించారు.  

→ ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. 

→ ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్‌ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. 

→ పారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్‌ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. 

→ ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. 

→ యూరప్‌లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్‌తోపాటు ఐస్‌ల్యాండ్‌లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. 

→ హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్‌లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. 

→ గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఉపాధ్యక్షుడు యింగ్‌మింగ్‌ యాంగ్‌ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు.  

→ మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్‌ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్‌మింగ్‌ యాంగ్‌ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement