న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ముప్పు పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తక్షణమే తగ్గించకపోతే ఈ పరిస్థితి భవిష్యత్లో మరింత దిగజారుతుందని ఇటీవల విడుదలైన యూనిసెఫ్ నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఈ వాతావరణ ప్రమాదాల్లో కనీసం ఒక వాతావరణ ప్రమాదానికైనా గురవుతారని పేర్కొంది.
ఇది వారి ఆరోగ్యం, విద్య, మనుగడనే ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. ‘వేడిగాలులు, కార్చిచ్చులు, కరువులు, వరదల ప్రభావంతో జీవితాలు నిరంతరం తలకిందులవుతున్నాయి. ప్రపంచంలోని సగం మంది పిల్లలు ఇప్పుడు తమ దైనందిన జీవితాలను ప్రభావితం చేసే వాతావరణ ముప్పులతో జీవిస్తున్నారు’అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. పునరుత్పాదక ఇంధన పరివర్తనను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నివేదిక ఏం చెప్పింది?
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచ నీటి చక్రాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం 180 కోట్ల మంది పిల్లలు కరువు ప్రమాదంలో ఉన్నారు. మరో 120 కోట్ల మంది తీవ్రమైన వేడికి గురవుతున్నారు. గత నెలలో పశ్చిమ ఐరోపా దేశాలు రికార్డు స్థాయిలో వడగాలులను చవిచూశాయి. వేసవిలో సాధారణంగా చూడని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదయ్యాయి. దాదాపు ప్రతి బిడ్డ వాయు కాలుష్యానికి గురవుతోంది.


