
ఇరాన్లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా...
1.ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్
టెహ్రాన్కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో పర్వతం అంతర్భాగంలో 90 మీటర్ల లోతున ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. నతాంజ్ కంటే ఇది పరిమాణంలో చిన్నదే. వైమానిక దాడుల నుంచి రక్షణతోపాటు అణుపరీక్షల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో కొండ దిగువన దుర్భేద్యంగా నిర్మించారు. ఫోర్డోను ఇజ్రాయెల్తోపాటు పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఇది పటిష్ట స్థితిలో ఉండడంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో అత్యాధునిక సెంట్రీఫ్యూజ్లను బిగించే సామర్థ్యం కలిగి ఉండడం. ఫోర్డోలో సైతం 60 శాతం శుద్ధి చేసిన యురేనిజం నిల్వలున్నాయి.
ఈ అణుకేంద్రంపై అమెరికా సైన్యం బి–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ద్వారా 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ (జీబీయూ–57) బాంబును ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి వల్ల ఫోర్డోకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వత ప్రాంతం భారీగా దెబ్బతినడంతోపాటు రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అమెరికా దాడి చేయడం తథ్యమన్న ముందస్తు అంచనాతో ఫోర్డో నుంచి యురేనియం, సెంట్రీఫ్యూచ్లు, కీలక పరికరాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
2. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ
ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 135 మైళ్ల దూరంలో నతాంజ్ అణుకేంద్రం ఉంది. ఇరాన్కు ఇదే అత్యంత ముఖ్యమైన యురేనియం శుద్ధి, నిల్వ కేంద్రం. అణు కార్యక్రమంలో నతాంజ్దే కీలక పాత్ర. అమెరికా దాడుల కంటే ముందు ఇక్కడ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వచేశారు. అణు బాంబు తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం. అంటే అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా సమీపంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా దాడుల కంటే ముందే ఇజ్రాయెల్ సైన్యం నతాంజ్పై దాడులకు పాల్పడింది.
ఈ దాడుల్లో భూఉపరితలంపై ఉన్న మౌలిక సదుపాయాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. భూఅంతర్భాగంలో ఉన్న పటిష్ట స్థితిలో సదుపాయాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, అమెరికా దాడుల్లో నతాంజ్లోని సెంట్రీఫ్యూజ్లు, ఇతర పరికరాలు చాలావరకు నామారూపాల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. నతాంజ్పై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. అవి సఫలం కాలేదు. నతాంజ్కు సమీపంలోని పికాక్స్ అనే పర్వతం కింద మరో భారీ అణుకేంద్రాన్ని నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు గతంలో వార్తలొచ్చాయి.
3. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్
టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 215 మైళ్ల దూరంలోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్లో యురేనియం కన్వర్షన్ సదుపాయాలు, ల్యాబ్లు, చైనా తయారీ రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది అణు శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడికి దిగడంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ, అమెరికా దాడిలో భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్లో రేడియేషన్ లీకేజీ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ప్రకటించింది.
ఇరాన్లోని మరికొన్ని అణు కేంద్రాలు (ఇక్కడ దాడులు జరగలేదు)
బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్
ఇరాన్లో ఇదొక్కటే కమర్షియల్ అటామిక్ రియాక్టర్. పర్షియన్ గల్ఫ్లో ఏర్పాటు చేశారు. రష్యా సరఫరా చేస్తున్న యురేనియంతో ఇక్కడ అణ్వస్త్ర తయారీ పరిశోధనలు జరుగుతుంటాయి.
అరాక్ హెవీ వాటర్ రియాక్టర్
పెవన్స్–గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నెలకొల్పారు. 2015లో ఈ కేంద్రాన్ని పాక్షికంగా ఆధునీకరించారు.
టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్
‘శాంతి కోసం అణుశక్తి’ అనే కార్యక్రమంలో భాగంగా 1967లో అమెరికా సరఫరా చేసిన టెక్నాలజీ, పరికరాలతో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తక్కువ శుద్ధి చేసిన యురేనియంతో అణు పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇవి కూడా...
→ కరాజ్ (అణు పరిశోధన కేంద్రం)
→ దార్కోవిన్(నిర్మాణంలో ఉన్న అణుకేంద్రం)
→ అనారక్(అణు పరిశోధన కేంద్రం)
→ అర్దాకన్(అణు పరిశోధన కేంద్రం)
→ సఘాంద్(యురేనియం మైన్)
– సాక్షి, నేషనల్ డెస్క్