
శాంతి నామం జపిస్తూ.. యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే..
నిఘా బెలూన్ల వ్యవహారంతో అమెరికా-చైనా దేశాల మధ్య వివాదం నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్.. చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు ఆయుధాలు ఇచ్చే యోచన చేస్తోందంటూ.. చైనాపై ఆరోపణలు చేశారు బ్లింకెన్. దీంతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ శాంతి నామం జపిస్తూ.. యుద్ధ భూమికి ఆయుధాలను పంపిస్తోంది అమెరికానే గానీ చైనా కాదంటూ విరుచుకుపడ్డారు.
తన చర్యలను కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై నిందలు మోపేందుకు తెగబడటమే గాక తప్పుడూ సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలను మానుకోవాలంటూ గట్టి కౌంటరిచ్చారు వాంగ్. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్రే పోషిస్తోందని, చర్చలతో సామరస్యం పూర్వకంగా పరిష్కిరించుకునే వైపే మొగ్గుచూపిందని వాంగ్ చెప్పుకొచ్చారు. అలాగే రష్యా చైనా సంబంధాల విషయంలో అమెరికా వేలు పెట్టేందుకు యత్నించవద్దని, దీన్ని తాము అంగీకరించమని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ సమస్యపై చైనా సదా శాంతినే కోరింది, చర్చలనే ప్రోత్సహించిందని వాంగ్ వెన్బిన్ స్పష్టం చేశారు.
(చదవండి: మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..)