టాయిలెట్ వస్తే ఏం చేస్తాం? అదేం ప్రశ్న.. వెళ్తాం అంటారా?
ఇప్పటివరకు జరిగింది.. జరుగుతోంది ఇదే.. పేదోడి దగ్గర నుంచిపైసలున్నోడి వరకు ఎవరైనా సరే.. టాయిలెట్ వస్తే.. అది ఎక్కడుంటేఅక్కడకు వెళ్లాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. టాయిలెట్ వస్తే.. మనం వెళ్లాల్సిన పనిలేదు. అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. పనిపూర్తయ్యాక చక్కగా వెళ్లిపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి..
బెడ్ నుంచి లేవలేని వృద్ధులు, పక్షవాతం వచ్చిన రోగుల కోసం చైనాకు చెందిన యుబాన్ అనే టెక్ కంపెనీ ఒక వినూత్నమైన అటానమస్ రోబో టాయిలెట్ను రూపొందించింది. దీనికి షాబాన్ అని పేరు పెట్టారు. షాంఘైలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల సంరక్షణ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించగా.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చక్రాల కుర్చీ తరహాలో ఉండే ఈ కమోడ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక సెన్సర్లతో పనిచేసే ఒక హైటెక్ రోబో.
బెడ్పై పడుకున్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ సాయంతో పిలిస్తే చాలు.. బాత్రూమ్లో డాకింగ్ స్టేషన్కు ఉన్న రోబో టాయిలెట్.. బెడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇందులో అమర్చిన లైడార్, లేజర్ సెన్సర్ల వల్ల ఇంట్లోని గోడలను లేదా వస్తువులను గుద్దుకోదు. టాయిలెట్ బెడ్రూమ్లోకి వచ్చినా.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇందులో హై–డ్యూటీ ఫోమ్ షీల్డ్, యాక్టివేటెడ్ చార్కోల్ (బొగ్గు) ఫిల్టర్లను ఉపయోగించారు. అందువల్ల బెడ్రూమ్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
పని పూర్తయిన తర్వాత సైలెంట్గా బాత్రూమ్లోని తన డాకింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. అక్కడ డ్రైనేజీ పైపుతో కనెక్ట్ అయ్యి.. లోపల ఉన్న వ్యర్థాలను ఒక సైలెంట్ గ్రైండర్ ద్వారా నలిపేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత తనను తాను 360 డిగ్రీల కోణంలో పూర్తిగా శానిటైజ్ చేసుకుంటుంది. చివరిగా మళ్లీ తన వాటర్ ట్యాంక్ను నింపుకొని, బ్యాటరీ చార్జ్ చేసుకుని తదుపరి పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. అంతా బానే ఉంది.. ధర ఎంత అంటారా? చైనా మార్కెట్లో దీని ధర 28,999 యువాన్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, రోగులకు ఇది ఒక గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు.
వయసు పైబడిన వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి చిన్న అవసరానికి, ముఖ్యంగా ప్రకృతి పిలుపు కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. కేర్టేకర్లకు కూడా ఇది శారీరకంగా పెద్ద శ్రమ. ఈ రోబో వల్ల రోగులు ఎవరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటివరకు ప్రకృతి మనల్ని పిలిచేది..
ఇకపై మనమే ప్రకృతిని పిలవొచ్చు అన్నమాట!!


