బీజింగ్: నైరుతి చైనాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. వాటిలో 11 మృతదేహాలను ముందుగా గుర్తించగా, తాజాగా మరో 30 మంది మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య 41కు చేరిందని బుధవారం ప్రకటించారు. మరో 50 మంది ఆచూకీ తెలియరాలేదని చెప్పారు.
చోంగ్కింగ్లోని పెంగ్షుయ్ కౌంటీలో జూలై 17న కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ అడుగున, నది ఒడ్డున ఉన్న పలు నివాస భవనాలు కొండచరియల కింద చిక్కుకున్నాయి.
ప్రభుత్వ మీడియా ప్రసారం చేసిన దృశ్యాల్లో భారీగా రాళ్లు, మట్టి కూలిపడి నివాస, వాణిజ్య బజారుపై పేరుకుపోయినట్టు కనిపించింది. ఘటనాస్థలిలో వందలాది మంది సహాయక సిబ్బందిని మోహరించారు.
ఘటనాస్థలిలో లభ్యమైన మృతదేహాలు, అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కొత్తగా 30 మంది బాధితుల మరణాన్ని ధ్రువీకరించినట్టు కౌంటీ అధికారులు తెలిపారు. ఈ విపత్తు చోటుచేసుకోవడానికి 2 వారాల ముందే వాయవ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్లో మరో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో 33 మంది మట్టిలో చిక్కుకోగా, 21 మంది మృతి చెందారు.


