అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్గా గుర్తింపు పొందింది.
ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.
సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.
ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.
ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.
భారత్ పరిస్థితి
భారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.
అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.
– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్


