
బ్రిటన్లో ఇటీవలి కాలంలో తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నార్త్-వెస్ట్ ఇంగ్లండ్లో ముగ్గురు చిన్నారుల హత్య ఆందోళనలకు దారితీసింది. అది హింసాయుతంగా మారి తీవ్ర రూపం దాల్చింది.
సౌత్ పోర్ట్కు చెందిన ఒక వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ చిన్నారుల హత్యకు ఒక వర్గానికి చెందిన వలసదారుడే కారణమంటూ ఆరోపించాడు. ఈ నేపధ్యంలో ఆ వర్గానికి చెందిన వలసదారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వాదం తీవ్రమైంది. కాగా ఈ కేసులో పోలీసు అధికారులు 17 ఏళ్ల ఆక్సెల్ రుడాకుబానా అనే కుర్రాడిని అరెస్టు చేశారు. ఇతను వేల్స్లోని కార్డిఫ్లో జన్మించాడు. ఈ కుర్రాడు తొమ్మిదేళ్ల ఆలిస్ డిసిల్వా అగ్యియర్, ఏడేళ్ల ఎల్సీ డాట్ స్టాన్కాంబ్, ఆరేళ్ల బేబ్ కింగ్ హత్యలకు కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఈ హత్యల నేపధ్యంలో బ్రిటన్లోని లివర్పూల్, మాంచెస్టర్, సుందర్ల్యాండ్, హల్, బెల్ఫాస్ట్, లీడ్స్తో సహా పలు ప్రాంతాల్లో హింసాయూత ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారు. లివర్పూల్లో నిరసనకారులు పోలీసులపైకి సీసాలు, ఇటుకలు విసిరారు. అలాగే వలసదారులకు చెందిన ఒక హోటల్ కిటికీలను పగులగొట్టారు. ఆందోళనకారుల దాడుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసు వ్యాన్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపధ్యంలో బ్రిటన్ అంతటా హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.