
ఢాకా,ఢిల్లీ: ఇక్కడే ఉంటే తమకు భూమిపై నూకలు చెల్లినట్లేనని భావించిన సుమారు 600 మంది బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత్ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి.
రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ గురువారం (ఆగస్ట్8న)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ ప్రకటన చేశారు.
అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. అల్లరి మూకలు పేట్రేగి పోయారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అల్లరి మూకల దమన కాండని ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్ తాత్కాలిక చీఫ్ షహీదుర్ రెహా్మన్ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! ఆర్మీ సైతం చేతులెత్తేసింది. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ తరుణంలో వందలాది బంగ్లాదేశ్ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి.
"Fear Being Killed": 600 Bangladeshis Try To Enter Bengal, Stopped By Border Force BSF https://t.co/NrH8JRrApU
— ahmed (@ahmed_ebs) August 7, 2024