రియాద్ : హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ప్రపంచ చమురు మార్కెట్ కీలక కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్కోకు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది.
ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు రాస్ తనూరా కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టెర్మినల్ అయిన రాస్ తనూరా నుండి సౌదీ అరామ్కో సంస్థ శుక్రవారం ముడి చమురు లోడింగ్ ప్రక్రియను పునఃప్రారంభించింది. చమురు రవాణా మళ్లీ మొదలైన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
‘సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం (జూన్ 28) ఉదయం సుమారు 6:00 గంటలకు రాస్ తానూరాలో కూలిపోయిందని ఇంధన మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది అమరులయ్యారు. వారందరూ సౌదీ జాతీయులే’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ‘హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి, సంబంధిత అధికారుల సమక్షంలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.


