గాజా సరిహద్దుల్లో 1500 హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్‌ | 1500 Hamas Operatives Bodies Found In Israel Around Gaza Strip: Says Israel Army - Sakshi
Sakshi News home page

Israel-Hamas War: గాజా సరిహద్దుల్లో 1500 హమాస్‌ మిలిటెంట్ల మృతదేహాలు: ఇజ్రాయెల్‌

Published Tue, Oct 10 2023 2:48 PM

1500 Hamas Operatives Bodies Found Around Gaza Strip: Israel Army - Sakshi

ఇజ్రాయెల్‌ సైన్యం–హమాస్‌ మిలిటెంట్ల మధ్య ఘర్షణ నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్‌ మెరుపుదాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్‌.. ప్రస్తుతం వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది.  ఇజ్రాయెల్‌  దాడులతో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి.

తాజాగా గాజా సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 1500 మంది హమాస్‌ ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్‌ ప్రాంతంలో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు కనుగొన్నామని. గాజా సరిహద్దుపై నియంత్రణ పునరుద్ధరించామని సైనిక ప్రతినిధి రిచర్డ్‌ హెచ్ట్‌ . వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచి ఎవరూ లోపలికి రాలేదని,  కానీ పలుచోట్ల చొరబాట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. గాజా సరిహద్దు చుట్టూ ఉన్న ప్రజలను సైన్యం దాదాపు తరలించిందని చెప్పారు. అయితే ఈ మరణాలను పాలస్తీనా మిలిటెంట్లు ధృవీకరించలేదు. 

మరోవైపు గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,600 దాటింది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 900 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 68700 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్‌ ప్రకటించింది. 
చదవండి: ఇజ్రాయెల్‌ సూపర్ నోవా ఫెస్టివల్‌పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..?

హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ పోలీసులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ కాల్చి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు లో ఇద్దరు హమాస్‌ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్‌ పోలీసులు వారిని వెంబడించి మట్టుపెట్టారు. కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేసి గన్‌తో కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు.ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement