శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 21 2026 7:33 AM | Updated on Aug 21 2026 7:33 AM

8లోu ‘నాయిని’ ముందంజ..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన క్రిమినల్‌ కేసుల వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 119 మంది ఎమ్మెల్యేల్లో 81మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో వెల్లడించగా.. వారిలో 58 మంది తీవ్రమైన కేసుల వివరాలను కూడా పేర్కొన్నారు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల విచారణలో జాప్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వ్యవహారంలో సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా అమికస్‌ క్యూరీగా సమర్పించిన తాజా 22వ నివేదికతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫారమ్స్‌ (ఏడీఆర్‌) విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్‌ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై నమోదైనట్లు పేర్కొన్న 28 కేసుల వివరాలను వెల్లడించారు.

మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేలపై కేసుల ‘చిట్టా’ ఎన్నికల ఉల్లంఘనలనుంచి అల్లర్ల వరకు నమోదైనవే..

ఉమ్మడి వరంగల్‌లో ఆరుగురిపై 28 క్రిమినల్‌ కేసులు కొండా సురేఖ అఫిడవిట్‌లో హత్యాయత్నం..

అభ్యర్థుల స్వీయ అఫిడవిట్ల ఆధారంగానే వివరాలు ‘సుప్రీం’కు విజయ్‌ హన్సారియా తాజా నివేదికలో వెల్లడి

తుది తీర్పు వచ్చేవరకు ఆరోపణలే..

● ఉమ్మడి వరంగల్‌లో మొత్తం 12మంది శాసనసభ్యులు ఉండగా ఆరుగురిపై కేసులు ఉన్నట్లు అమికస్‌ క్యూరీ రిపోర్టులో పేర్కొన్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తన అఫిడవిట్‌లో 8 క్రిమినల్‌ కేసులు ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం), 332, 333, 353 వంటి ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం/దాడికి సంబంధించిన సెక్షన్లతో పాటు 143, 149, 188, 341, 504 తదితర సెక్షన్లు ఉన్నాయి.

రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తన అఫిడవిట్‌లో 6 కేసులు ప్రకటించారు. వీటిలో ప్రధానంగా ఐపీసీ 143, 149, 341 సెక్షన్లతో కూడిన కేసు ఉండగా.. మిగిలిన కేసుల్లో సీఆర్‌పీసీ 151 కింద నిర్బంధానికి సంబంధించినవి ఉన్నాయి. కేసులన్నీ నిరసనలు తెలిపిన సందర్భంగా నమోదయ్యాయని పేర్కొన్నారు.

కొండా సురేఖపై 5 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం) కేసు ఒకటి ఉంది. ఒక కేసులో ఆరమ్స్‌ ఆక్ట్‌ సెక్షన్‌ 27 కూడా నమోదైనట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.

డిప్యూటీ స్పీకర్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచంద్రునాయక్‌పై 4 కేసులు ప్రకటించారు. వాటిలో ఐపీసీ 294, 506, 149; 109, 147, 324, 341, 427, 506, 149; 452, 448, 143, 188, 353, 149 వంటి సెక్షన్లు ఉన్నాయి.

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళీనాయక్‌పై 3 కేసులు ఉన్నట్లు ప్రకటించారు. మూడు కేసుల్లోనూ ప్రధానంగా అక్రమ సమూహం, విధులకు ఆటంకం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన తదితర ఆరోపణల సెక్షన్లు కనిపిస్తున్నాయి.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై రెండు కేసులు ప్రకటించారు. ఒకటి ఐపీసీ 188 కింద, మరోటి ఐపీసీ 171–ఇ, కింద నమోదైనట్లు రికార్డులో ఉంది.

ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల వేగవంతమైన విచారణ అవసరంపై సుప్రీంకోర్టు పలు మార్లు దృష్టి సారించింది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు వెల్లడించడం ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఉపయోగపడుతున్నప్పటికీ.. కేసుల తుది పరిష్కారంలో జాప్యం కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, కేసు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని, న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చే వరకు ఆరోపణలను నిర్ధారిత అంశాలుగా పరిగణించరాదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement