ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన ఫలాలను అందించడానికి కమిషన్ కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో కమిషన్ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భూ వివాదాలు, అట్రాసిటి కేసుల నమోదు విచారణ, పురోగతి, ప్రభుత్వశాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల పకడ్బందీ అమలుపై చర్చించారు. కేసుల పురోగతిపై పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేసుల పురోగతిని పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం చివరలో పాల్గొన్న సీపీ శ్వేతకు చైర్మన్ సూచించారు.
బాధితులకు పునరావాసం కల్పించాలి..
బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతో వదిలేయకుండా పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, గృహవసతి కల్పించాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. సివిల్ రైట్స్ డే సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. అనంతరం చైర్మన్ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కమిషన్ సభ్యులతోపాటు డీసీపీ అంకిత్కుమార్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.


