కాశిబుగ్గ: ఆయుష్ హౌస్సర్జన్లు ఆస్పత్రుల్లో ప్రతీరోజు ఓపీ, ఐపీ సేవలు, ఇతర అత్యవసర సేవలు, పేషంట్ల పర్యవేక్షణ, క్లినికల్ విధులు, నైట్ డ్యూటీల బాధ్యతలను అల్లోపతిక్ వారితో సమానం నిర్వహిస్తున్నప్పటికీ స్టైఫండ్ చెల్లింపులో మాత్రం తీవ్ర వివక్ష చూపుతున్నారంటూ వరంగల్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి వరంగల్ హౌస్సర్జన్లు ఆందోళనబాట పట్టారు. తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ప్రస్తుతం తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లకు నెలకు రూ.13,754 మాత్రమే స్టైఫండ్ చెల్లిస్తుండగా, అల్లోపతిక్ హౌస్ సర్జన్లకు మాత్రం రూ.29,972 ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పరిధిలో పేషంట్లకు ఒకే విధమైన సేవలు అందిస్తున్నప్పటికీ ఇంత వ్యత్యాసం కూడుకుని ఉండటం రాజ్యాంగం ప్రకారం సమానత్వ హక్కుకు విరుద్ధమని ఆవేదన వెలిబుచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో సమానంగా చెల్లిస్తున్నా...
పొరుగు తెలుగు రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశ్లో అల్లోపతిక్, ఆయుష్ హౌస్సర్జన్లకు సమానంగా రూ.26వేల స్టైఫండ్ చెల్లిస్తున్నారని తెలిపారు. అక్కడ వివక్ష లేకుండా సమానత్వం పాటిస్తుంటే తెలంగాణలో మాత్రం తమపై వివక్ష కొనసాగించడం విచారకరమని ఆవేధన వ్యక్తం చేశారు. 2009 సంవత్సరంలో జారీ చేసిన జీఓ నంంబర్ 77 ప్రకారం సమానంగా స్టైఫండ్ చెల్లించాలని స్పష్టంగా ఉన్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు.
తక్కువ స్టైఫండ్తో తప్పని ఆర్థిక ఇబ్బందులు
ప్రభుత్వం తక్కువ స్టైఫండ్ చెల్లించడం వల్ల హౌస్ సర్జన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆయుష్ వైద్య విధానాలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం ఒకవైపు చెబుతూ, అదే వ్యవస్థలో పనిచేస్తున్న వైద్యులకు న్యాయం చేయటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమాన పనికి సమానం స్టైఫండ్ సూత్రాన్ని అమలు చేసి, జీవో 77ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బసరే, సభ్యులు డాక్టర్ సంగమేశ్వర్రెడ్డి, డాక్టర్ శేషు కుమార్, డాక్టర్ వంశీ, డాక్టర్ యజ్ఞిక్, డాక్టర్ హర్షిత, డాక్టర్ కీర్తన, డాక్టర్ మాధురి పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమానంగా ఇచ్చారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలోపతిక్, ఆయుష్ అనే తేడా లేకుండా హౌస్ సర్జన్లకు సమానంగా స్టైఫండ్ చెల్లించేవారు. 2009లో జారీ చేసిన జీఓ 77 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఇచ్చిన స్టైఫండ్ విధానాన్ని అమలు చేయడం లేదు.
– డాక్టర్ ఈ.శేషు, హౌస్సర్జన్
ప్రతీ ఏడాది 15 శాతం స్టైఫండ్ పెరగాలి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత 287 జీఓ ప్రకారం ప్రతీ సంవత్సరం 15 శాతం చొప్పున స్టైఫండ్ పెరగాలి. 2026 వరకు కేవలం రెండుసార్లు మాత్రమే స్టైఫండ్ పెంచి, ఇప్పుడు బంద్ చేశారు.
– డాక్టర్ ఈ.సంగమేశ్వర్రెడ్డి, హౌస్ సర్జన్
ఫ్యాకల్టీని పెంచాలి...
విద్యా బోధనకు అవసరమైన ఫ్యాకల్టీని పెంచాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనను కొనసాగించాలి. ఆయుష్ వైద్య విద్యార్థులకు తగిన ప్రోత్సాహం కల్పించాలి.
– డాక్టర్ సాయి హర్షిత, హౌస్సర్జన్
అల్లోపతిక్ హౌస్ సర్జన్జతో
సమానంగా పనిచేస్తున్నాం..
డిమాండ్లు సాధించేవరకు
ఆందోళన కొనసాగిస్తాం..
ఆయుష్ వైద్య విద్యార్థుల
నిరవధిక సమ్మె ఆరంభం


