కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి
కేయూ క్యాంపస్: నేర్చుకుంటూ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా సేవలందించే రోబోటిక్ అనేది నేటి సాంకేతిక యుగం అని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని గణితశాస్త్ర విభాగంలోని శ్రీనివాసరామానుజం సెమినార్హాల్లో డిప్లాయిబుల్ రోబోటిక్స్ దట్ లెర్న్ అంశంపై నిర్వహించిన విస్తృతోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనేక ప్రధాన రంగాల్లో రోబొటిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతల్లో దేశ విదేశాల్లో అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వం, యూనివర్సిటీలు కల్పించే స్టూడెంట్ ఎక్చేంజ్ కార్యక్రమాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కేయూ నుంచి 10 నుంచి 20 వరకు స్టార్టప్లు అవిర్భవించే అవకాశాలున్నట్లు తెలిపారు.
పరిమితులు అధిగమించే దిశగా..
కేయూ విస్తృతోపన్యాసంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల జార్జిమెషన్ యూనివర్సిటీ రోబోటిక్స్ ల్యాబ్ పరిశోధకులు డాక్టర్ ష్యూనుషియానో మాట్లాడుతూ.. సాధారణ వినియోగదారుల సూచనలతో రోబోల చలన ప్రణాళికలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, విధి నిర్వహణ సమయంలో భూభాగ పరిస్థితులకు అనుగుణంగా రోబోలు స్వయంగా పని తీరును మార్చుకొని స్థిరంగా ప్రయాణించే సామర్థ్యాన్ని పెంపొందుంచుకోవడం వంటి అంశాలను ఆయన వివరించారు. అనంతరం డాక్టర్ షియావోను శాలువాతో సత్కరించారు. సమావేశంలో కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రమణ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ బి.రమ, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భిక్షాలు, కేయూ మాజీ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి మాట్లాడారు.


