హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
వరంగల్ స్పోర్ట్స్: విద్య, క్రీడలు రెండింట్లోనూ రాణించేలా విద్యార్థులు ఎదగాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల అభ్యసన స్థాయి, అందుతున్న వసతులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సుమారు రూ.70 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కొత్త ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్కుమార్, యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


