చేబ్రోలు: ఫార్మసీ రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశోధనా దృక్పథం, నాయకత్వ లక్షణాలు ఎంతో అవసరమని ఐపీజీఏ అధ్యక్షుడు డాక్టర్ అతుల్ నాసా అన్నారు. ఫార్మసీ రంగంలో భవిష్యత్ అవకాశాలు, కెరీర్ మార్గాలు, వృత్తిపరమైన అభివృద్ధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ఏపీ ఫార్మసీ లీడర్ షిప్ సమ్మిట్–2026’ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, ఫార్మసీ కళాశాల, ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) ఏపీ స్టేట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐపీసీ–2026 బ్రోచర్ను అతిథులు ఆవిష్కరించారు. ‘అన్లాకింగ్ ఫ్యూచర్ కెరీర్స్ అండ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్’ అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఫార్మసీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులకు భవిష్యత్ కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు పరిశ్రమలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాంకేతికత, పరిశోధన రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


