● మొదలైన కృష్ణానది పరవళ్లు
● ఈ ఏడాది తొలిసారి నాగార్జునసాగర్కు
చేరుకున్న వరదనీరు
● ఎగువ నుంచి 50 వేల
క్యూసెక్కుల ఇన్ఫ్లో
● కృష్ణానది పరివాహక ప్రాంత
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
సాక్షి, నరసరావుపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణమ్మ పరవళ్లు నాగార్జునసాగర్కు చేరుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమై తొమ్మిది వారాలైనా సరైన వర్షాలు పడక, సాగర్ డ్యాం నిండక ఆందోళనలో ఉన్న రైతులకు ఊరటనిస్తూ కృష్ణా జలాలు సాగర్ వైపు వడివడిగా పరుగులు ప్రారంభించాయి. ఎగువన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే శ్రీశైలం డ్యాంకు రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వదర నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శనివారం నాగార్జునసాగర్కు 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామఽర్థ్యానికి గాను శనివారం మధ్యాహ్ననికి 173.87 టీఎంసీలు చేరింది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు 2,15,782 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అవుట్ ఫ్లో 15,726 క్యూసెక్కులుగా నమోదైంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో మరో రెండు రోజులు కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని క్రస్ట్ గేట్ల ద్వారా వరద నీటిని కిందకు వద లడంతో సాగర్ డ్యాం నీటిమట్టం ఆశించిన మేర పెరిగే అవకాశముంది. దీంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న సుమారు 14.83 లక్షల ఎకరాల భూముల రైతుల్లో సాగు ఆశల చిగురిస్తున్నాయి. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను శనివారం ఉదయానికి 171.2 టీఎంసీ నీరు చేరింది.


