బైపాస్ సర్వీస్రోడ్లో హైవేటవర్స్ వద్ద మురుగునీటిని, వర్షపు నీటిని తొలగిస్తున్న సెప్టిక్ ట్యాంక్
తాడేపల్లి రోడ్డులో మురుగునీటిని తొలగిస్తున్న దృశ్యం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కార్పొరేషన్ అధికారులు హడావుడి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి రూరల్ ఆత్మకూరు వరకు జాతీయ రహదారి వెంబడి, పాత జాతీయ రహదారి వెంబడి తాడేపల్లి రోడ్లపై, గుంతల్లో నిలిచిన మురుగునీరు, వర్షం నీటిని అప్పటికప్పుడు తొలగించే ఏర్పాట్లు చేశారు. సుమారు 4–5 సెప్టిక్ ట్యాంక్లను ఏర్పాటు చేసి బీటీ రోడ్డుపై పల్లంగా ఉన్న ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద, ఎన్టీఆర్ కరకట్ట నుంచి బైపాస్ వెళ్లే మార్గంలో, జాతీయ రహదారి సర్వీస్రోడ్డులోని హైవే టవర్స్ వద్ద వున్న వర్షం నీటిని, మురుగునీటిని తొలగించారు. సీతానగరం బోటుయార్డు, రైల్వే అండర్పాస్, బైపాస్రోడ్ అండర్పాస్లతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటిని హడావుడిగా కార్పొరేషన్ అధికారులు తొలగించారు. హడావుడి చూసి ఆ ప్రాంతవాసులు నవ్వుకున్నారు.


