గుంటూరు లీగల్: న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఎస్వైకే లీగల్ వారియర్ టీం నిలిచింది. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల కోసం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఫైనల్ మ్యాచ్తో ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో చందు 11 జట్టుపై ఎస్వైకే లీగల్ వారియర్స్ జట్టు విజయం సాధించింది. ఆకాష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా, సాజిద్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు. ఫైనల్ మ్యాచ్ను గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధిర నాగేశ్వరరావు టాస్ వేసి ప్రారంభించారు. జట్లను ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ఎ.శాంతకుమార్, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అభినందించారు. విజేత, రన్నరప్ జట్లకు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కప్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
● తహసీల్దార్, రెవెన్యూ ఉద్యోగులపై
అనుచిత వ్యాఖ్యలు దారుణం
● కలెక్టర్కు ఏపీ రెవెన్యూ సర్వే
అసోసియేషన్ వినతి
గుంటూరు వెస్ట్: గుంటూరు గనులు, భూగర్భశాఖ ఉప సంచాలకులు చంద్రశేఖర్ ఇటీవల మీడియా ప్రతినిధుల సమక్షంలో గుంటూరు జిల్లా తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారులపై చేసిన అసభ్యకర, అవమానకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా బాధించినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పీఏ కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధానమని తెలిపారు. ఎన్ఓసీ( నో అబ్జక్షన్ సర్టిఫికెట్)ను మంజూరు చేసే అధికారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీ పరిధిలోనే ఉంటుందన్నారు. తహసీల్దార్కు ఆ అధికారం లేదని, ఈ విషయం తెలిసినప్పటికీ చంద్రశేఖర్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం క్షమార్హం కాదని పేర్కొన్నారు. చంద్రశేఖర్ మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజల్లో ప్రభుత్వ శాఖల మధ్య విభేదాలు ఉన్నాయనే తప్పుడు అభిప్రాయం ఏర్పడే పరిస్థితి నెలకొందని వివరించారు. రెవెన్యూ ఉద్యోగుల వినతి మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరావు, తహసీల్దార్లు కృష్ణకాంత్, షేక్ సుభాని, వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, జిల్లా జనరల్ సెక్రెటరీ, రామారావు అసోసియేట్ ప్రెసిడెంట్ ఆయూబ్, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


