గుంటూరు వెస్ట్: జిల్లాలో గర్భస్థ లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎస్డీటీ), సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం (ఏఆర్టి) అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ గర్భస్థ శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. లింగనిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లాలోని వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనన్నారు. కమిటీ సభ్యులు, ఎన్జీఓలు లింగ నిర్థారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు నాగరాజు, వెంకట నాగ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంపై సమీక్ష
తాడికొండ: రాజధాని నగరానికి ముఖ ద్వారంగా నిర్మాణం రూపుదిద్దుకుంటున్న ఉండవల్లి స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు గురువారం క్షేత్రస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయపూడిలోని బ్లాక్ –4 అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి, గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ, సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, ఏడీసీ అధికారులు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం – పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ, జనరల్ మేనేజర్ కె శ్రీహరి పాల్గొన్నారు.
– జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


