ఏఎన్యూ(పెదకాకాని): క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జేసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడుతాయన్నారు. గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని చెప్పారు. అమరావతి చాంపియన్షిప్లో భాగంగా జిల్లా నుంచి ఎక్కువ మంది పాల్గొని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ మాట్లాడుతూ 12 విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం జేసీ, క్రీడాశాఖ అధికారులు జెండా ఊపి క్రీడాపోటీలను ప్రారంభించారు. అన్ని విభాగాల్లో క్రీడాకారులు, నిర్వాహకులు మొత్తం 2500 మంది పాల్గొన్నారు.


