అవగాహనే తొలి ఔషధం గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026 గుంటూరు మెడికల్: నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ–సీడీ) 4.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు దాటిన మహిళలకు పరీక్షలు చేశారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారు 18,30,874 మంది ఉండగా, వీరిలో 10,05,393 మందికి వీటిని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నోటి క్యాన్సర్ బాధితులు 288, రొమ్ము క్యాన్సర్ 699, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు 457 మంది ఉన్నట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. అవగాహన లేకపోవడంతో పేద, మధ్యతరగతి మహిళలు వ్యాధి బారిన పడి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
గంటకు తొమ్మిది మంది మృతి
ప్రభుత్వం సర్వే చేయిస్తున్న మూడు రకాల క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు వ్యాక్సిన్ ఉంది. ప్రభుత్వం 15 ఏళ్ల వయస్సు ఉన్న కౌమార బాలికలకు క్యాన్సర్ సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వారికి ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియక ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. అందువల్లే మన దేశంలో ప్రతి గంటకు తొమ్మిది మంది చనిపోతున్నారు. వ్యాధిని కట్టడి చేయకుండా వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడి అవస్థలు పడుతున్నారు.
కారణాలు ఇవీ.. సర్వైకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ). ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్కు కారణమవుతుంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సర్వైకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయస్సులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్య కారణాల వల్ల కూడా కొంతమందిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగు చూస్తున్నాయి.
న్యూస్రీల్
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు.....
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలో గుర్తించలేరు. రుతుక్రమ సమయంలో లేదా లైంగిక సంభోగం తర్వాత యోని నుంచి అసాధారణంగా రక్తస్రావం జరుగుతుంది. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం, యోని నుంచి దుర్వాసన రావడం, రక్తంతో కూడిన గడ్డలు రావడం, యోని నుంచి మలం రావడం జరుగుతుంది. మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. పొత్తికడుపు నొప్పి, నడుంనొప్పి, కాళ్ల నొప్పి, కాళ్ల వాపు ఉంటాయి. బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
● ఎన్సీడీ–సీడీ సర్వేలో
బయటపడుతున్న వాస్తవాలు
● ముందస్తు జాగ్రత్తలతో
వ్యాధి కట్టడికి అవకాశం
క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది (ఫైల్)
క్యాన్సర్... ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతుంది. పూర్వం రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ సోకితే మరణమే అనే భావన చాలా మందిలో ఉంది. నేడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు చాపకింద నీరులా నమోదవుతున్నాయి. ఆధునిక జీవనశైలి వల్లే కేసుల సంఖ్య పెరిగిపోతుందని వెద్య నిపుణులు చెబుతున్నారు.