ఏఎన్యూ (పెదకాకాని): ఏఎన్యూలోని కాంట్రాక్ట్ అధ్యాపకులను సేవలను తక్షణమే క్రమబద్ధీకరించాలని సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం ఎదుట ఒప్పంద అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా వారికి సంఘీభావంగా ఇతర ఒప్పంద అధ్యాపకులు కూడా తమ బోధనా కార్యక్రమాలు ముగిసిన వచ్చి మద్దతు తెలిపారు. ముందుగా జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుని విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఎన్. భరత్గుప్తాను కలసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర స్థాయి ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చేపట్టిన ఈ దీక్షల్లో భాగంగా అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం తమను కూడా రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పరిగణించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏఎన్యూ వద్ద 18వ రోజుకు
చేరిన రిలే నిరాహారదీక్షలు


