లక్ష్మీపురం: గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ అరుణ్ రిచర్డ్ సారథ్యంలో ‘టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ’ (టోలీక్) హిందీ సమావేశం బుధవారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దైనందిన కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడం, అధికారుల్లో హిందీపై పని పరిజ్ఞానాన్ని పెంపొందించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో పనిచేస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధికారిక హిందీలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకునే ఆచరణాత్మక పద్ధతులపై సమావేశంలో చర్చించారు. ముందుగా గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ సునీల్ చౌదరి అధికార భాషా చట్టం తదితరాలను వివరించారు. పలువురు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు అధికార భాష అమలుపై అవగాహనను బలోపేతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ దేవ్కుమార్ రిజ్వాని మాట్లాడుతూ, హిందీ వినియోగం కేవలం అధికార భాషకు సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను నెరవేర్చడమే కాకుండా, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమన్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కూడా దోహదపడుతుందన్నారు. అధికారులకు సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ హెయర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు రవీంద్రనాథ్, అశుతోష్, అమృత్ రాజ్, శశిదాస్, ఆనందగోపాల్, చంద్రవర్మ, నీరజ్, రవి, శ్యాంప్రకాశ్, అమిత్, చక్రధర్, రాజేష్, ప్రణిత, ఫణి తదితరులు పాల్గొన్నారు.


