గుంటూరు వెస్ట్: ప్రజల అవసరాలను గమనించి ఉత్తమ అధికారులుగా చిరస్మరణీయ సేవలు అందించాలని గ్రూప్–1 యువ అధికారులకు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సూచించారు. సమస్య పరిష్కార వైఖరి కలిగి ఉండాలని సూచించారు. 2026 గ్రూప్–1 బ్యాచ్లో ఎంపికై న అభ్యర్థుల క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవలను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి వైఖరి కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఫలితాలు సాధించగలిగే యుక్తి ఉండాలని పేర్కొన్నారు. ఒక పనిలో తుది లక్ష్యాన్ని పక్కాగా సాధించగలిగే విధంగా ఉండాలని చెప్పారు. పనిలో ఆనందం పొందాలని, సంతృప్తి సాధించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి అనుసంధానం వంటి సమస్యలు, ప్రసవాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడం ప్రధానమన్నారు. నెలకు ఎనిమిది, తొమ్మిది మాతృ మరణాలు ఉండగా ‘మాతృ దేవో భవ’ కార్యక్రమాన్ని నిర్వహించి ఒకటికి తీసుకువచ్చామని తన అనుభవాలను పంచుకున్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణను ఉత్తమంగా చేయడం గొప్ప కళన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య సమన్వయం కలిగి ఉండాలన్నారు. ఉన్నతాధికారుల సూచనలు తమకు ఎంతో ఉపకరించాయని యువ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల సంస్థ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ


