అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధ పడుతున్న నాలుళ్ల అస్వత్ గురుదత్ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు రూ.26 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం మనసున్న దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు తల్లిదండ్రులకు అండగా నిలిచిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి
గుంటూరు ఎడ్యుకేషన్: నాలుగేళ్ల వయసులోనే అరుదైన జన్యుపరమైన వ్యాధికి గురైన చిన్నారిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని మాస్టర్మైండ్స్ విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. బుధవారం బ్రాడీపేటలోని మాస్టర్మైండ్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ తమ వద్ద సీఏ అభ్యసించి తెనాలిలో స్థిరపడిన హరీష్, బాల నవ్య శ్రీ దంపతుల నాలుగేళ్ల కుమారుడు అశ్వత్ గరుదత్ జన్యుపరమైన అరుదైన కండరాల వ్యాధి డీఎండీ (డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ)కి గురై తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని చెప్పారు. ఈ వ్యాధిని నయం చేసేందుకు అమెరికాలోనే ఉండే ఇంజక్షన్ ఖరీదు 26 కోట్ల రూపాయలు అవుతుందని, అంత శక్తి లేని ఆ కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు, సభ్య సమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఏ విద్యను పూర్తి చేసుకున్న మాస్టర్మైండ్స్ పూర్వ విద్యార్థులైన తల్లిదండ్రులు తెనాలిలో వృత్తిని కొనసాగిస్తున్నారని చెప్పారు. నాలుగేళ్ల వయసు గల కుమారుడు అశ్వత్ గురుదత్ అనారోగ్యానికి గురి కావడంతో గత ఏడాది బెంగళూరులోని శివాన్సీ న్యూరో మెడికేర్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా అరుదైన వ్యాధి బయటపడిందన్నారు. మాస్టర్ మైండ్స్ అధ్యాపకులు, యాజమాన్యం, విద్యార్థులు సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. అదే విధంగా వేర్వేరు మార్గాల ద్వారా ఇప్పటి వరకూ రూ.3.11కోట్లు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ రూ.26 కోట్ల భారం మోయలేని పరిస్థితుల్లో సోషల్ మీడియాతో పాటు మీడియా ద్వారా దయా హృదయులైన దాతలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. పునర్విక శ్రీ అనే బాలికకు ప్రభుత్వం సాయం చేసిన విధంగా అశ్వత్ గురుదత్కు పునర్జన్మ ప్రసాదించాలని కోరుతున్నామన్నారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలకు చేపట్టేందుకు కేటాయించే సీఎస్ఆర్ నిధులను బాలుడి వైద్యానికి అందించాలని కోరారు. దాతలు తమ విరాళాలను ఫోన్ పే నెంబర్ 9700 365341కు పంపాలని తల్లిదండ్రులు హరీష్, నవ్య శ్రీ విజ్ఞప్తి చేశారు.


