తాడేపల్లి రూరల్: తాడేపల్లి కృష్ణాకెనాల్ పరిధిలో గుంటూరు వెళ్లే రైల్వే మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారంతో బుధవారం తాడేపల్లి కృష్ణాకెనాల్ జీఆర్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాక్పై రెండు ముక్కలుగా పడిఉన్న మృతదేహాన్ని పక్కకు తీశారు. ఏఎస్ఐ రత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం రైల్వేట్రాక్పై 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి రెండు ముక్కలుగా పడి ఉన్నాడని, అతని జేబులో వెతగ్గా ఆధార్ కార్డు లభించిందని, అయితే ఆధార్కార్డులో ఉన్న వ్యక్తి ఇతను ఒకటేనా అన్నది అనుమానంగా ఉందని తెలిపారు. ఆధార్కార్డులో వీర్ల గురవయ్య, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం, పోలేపల్లి గ్రామం అని ఉందని, ఆ గ్రామంలో విచారణ చేస్తే తప్ప ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరా కాదా అనేవిషయం తెలియదన్నారు. మృతదేహాన్ని గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో గుంటూరు రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక శివారులో చిగురు ఆశ్రమం దగ్గర అమరావతి కరకట్ట దిగువ ప్రాంతంలో తాడేపల్లి పోలీసులు బుధవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి మాట్లాడుతూ.. పెనుమాక శివారులోని చిగురు ఆశ్రమం ఎదురుగా కరకట్ట దిగువ ప్రాంతంలో ఓ చెట్టుకింద సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం ఉందని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, నెరిసిన జుట్టు, తెల్లని గడ్డం ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 8688831364 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి
నరసరావుపేట: పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులోని సాయిరాం టౌన్షిప్–2లో టీఎస్ నెంబర్ 35లోని 1.28 ఎకరాలపై హైకోర్టులో కేసు నడుస్తుండగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు, రైతులు కోరారు. ఈ మేరకు ప్రకాష్నగర్లోని జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, రిజిస్ట్రార్ శ్రీరామకుమార్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ వెంచర్ యజమానులు కోర్టులో పెండింగ్లో ఉన్న భూములు అమ్మడమే గాక అక్రమ రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.


