మంగళగిరి రూరల్: మండల పరిధిలోని బేతపూడిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రకృతిని ప్రేమించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా యువత తమ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి పనిచేయాలన్నారు. కుటుంబ వ్యవస్థే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను పరిశ్రమలను మరింత దగ్గర చేస్తున్నామని, ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విద్య అంటే కేవలం వృత్తిపరమైన జీవితాన్ని నిర్మించుకోవడం మాత్రమే కాదని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిందని అన్నారు. అమృత విశ్వ విద్యాపీఠం అమృత యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయేంద్రజీ, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ స్వామి నిజామృతానందపురిజీ, అమరావతి క్యాంపస్ రిజిస్ట్రార్ విపిన్ నాయర్, డీన్ సీకే జయశంకర్ పాల్గొన్నారు.


