పెదకాకాని: అక్రమంగా కోడె దూడలను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి సంత నుంచి మంగళవారం కోడె దూడల లోడుతో కంటైనర్ లారీ నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట బయలు దేరింది. ఈ లారీ రాత్రి 9 గంటలకు పెదకాకాని వై జంక్షన్కు చేరుకునే సరికి అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమంగా 35 కోడె దూడలను తరలిస్తున్నట్లు గుర్తించి లారీని పోలీసుస్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో మణికంఠ, జమి రాజశేఖర్, ఐనవోలు హరిప్రసాద్లు గత కొంతకాలంగా అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు వెల్లడైంది. జిల్లెళ్లగూడెంకు చెందిన డ్రైవర్ సింహాద్రిని అదుపులోకి తీసుకున్నారు. మానవతా ధృక్పదంతో స్పందించిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఉన్న కోడె దూడలను కాళీగార్డెన్స్ సమీపంలో ఉన్న గేదెల షెడ్డుకు తరలించి పశుగ్రాసం, నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. కోడెదూడలను తరలిస్తున్న మణికంఠ, జమి రాజశేఖర్, ఐనవోలు హరిప్రసాద్లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.


