పింగళి, బళ్లారి
గుంటూరు వెస్ట్: పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవలు దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులు అని, వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం, వారు సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకోవడం ఆనందదాయకమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రంగస్థల కళాకారుడు బళ్లారి రాఘవ జయంతి కార్యక్రమం ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవ చిత్రపటాలకు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున గర్వంగా ఎగురవేస్తున్న భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య భారతదేశానికి చిరస్మరణీయమైన సేవ చేసిన మహనీయులని కొనియాడారు. కళారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన బళ్లారి రాఘవ నటనా వైభవం గొప్పదని చెప్పారు. క్రిమినల్ లాయర్ గాను ఆయన సేవలకు బ్రిటీష్ ప్రభుత్వ ప్రశంసలు కూడా పొందారని గుర్తు చేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ పి.వి.ఎన్.సత్యనారాయణ, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.10 అడుగులకు చేరింది. ఇది 136.9932 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


