
అంతిమ ప్రయాణం
రహదారి ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
పుట్టెంట్రుకలు తీయడానికి ఆలయానికి వెళ్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చాగల్లు వద్ద ట్రాలీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇలా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ఉలవపాడు/మాచవరం: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతుల కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణకు పుట్టెంట్రుకలు తిరుమలలో తీయించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో కలిసి 11 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలో ముందు వెళుతున్న ట్రాలీ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. తర్వాత వారి వాహనం బోల్తాకొట్టింది.
కుటుంబం కకావికలం...
చిన వెంకటేశ్వర్లు, సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిడుగురాళ్లలో చిన వెంకటేశ్వర్లు వెల్ఫేర్ అసిస్టెంట్గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇద్దరూ సంతోష జీవితం గడపాల్సిన సమయంలో ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. చిన వెంకటేశ్వర్లు తన కుమారుడు, భార్య, తల్లిని పోగొట్టుకున్నారు. సుభాషిణి తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. చిన వెంకటేశ్వర్లు వదిన కూడా చనిపోయింది.
రైలులో వెళ్లాలని భావించినా..
ముందు తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. రైలు అయితే ఇబ్బందులు ఉండవని చిన వెంకటేశ్వర్లుకు సోదరుడు చెప్పాడు. కానీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని, కారులో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.. అని పేర్కొనడంతో పిడుగు రాళ్లకు చెందిన గంగరాజు తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. 9 గంటలకు బయలుదేరారు. మధ్యలో టీ తాగేందుకు ఆగారు. మళ్లీ బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. రైలులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదని మిగతా కుటుంబసభ్యులు, బంధువులు వాపోతున్నారు.
మృతదేహాలు అప్పగింత...
ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలలో వెంకట నరసమ్మ, సుభాషిణి, తేజస్విని అభినయ్ కృష్ణ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
మృతులందరూ ఒక్క కుటుంబానికి చెందిన వారే బాలుడి పుట్టెంట్రుకలు తీయడానికి వెళ్తుండగా దుర్ఘటన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి కూడా మృత్యువాత ఘోర ప్రమాదంతో కకావికలమైన కుటుంబం
మృతుల వివరాలివీ...
ప్రమాద స్థలిలోనే చిన వెంకటేశ్వర్లు తల్లి వెంకట నరసమ్మ (55), భార్య సుభాషిణి (30)లు మృతి చెందారు. చిన వెంకటేశ్వర్లు కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణ (3)ను కావలి ఏరియా వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఆయన వదిన రుక్మిణమ్మ (35) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మామ యర్రం శ్రీనివాసరావు (58) నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శ్రీనివాసరావు స్వస్థలం గణేశునిపాడు పక్కనే ఉన్న అగ్రహారం గ్రామం.

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం

అంతిమ ప్రయాణం