Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది

Atheist Ravipudi Venkatadri Celebrates 101st Birthday - Sakshi

హేతువాద ఉద్యమానికి తెలుగునాట ప్రాచుర్య ప్రాశస్త్యాలను తీసుకువచ్చినవారు రావిపూడి వేంకటాద్రి. ఆయన నేడు 100 వసంతాలను పూర్తిచేసుకుని 101వ ఏట అడుగుపెడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకూ, ఉద్యమపరంగా సమాజానికీ ఒక చారిత్రక ఘట్టం.

1922 ఫిబ్రవరి 9న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన వేంకటాద్రి 1943లో తన 21వ ఏటనే స్వగ్రామంలో ‘కవిరాజాశ్రమం’ స్థాపించారు. అంత చిన్నవయసులోనే సామాజిక, హేతువాద ఉద్యమాల ప్రముఖనేతలను తమ గ్రామానికి ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించి, ప్రజల్లో చైతన్యబీజాలు నాటారంటే రావిపూడి శక్తిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు. తన అభిమానకవి, ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి పేర ‘కవిరాజు ట్యుటోరియల్స్‌’ స్థాపించి, మిత్రులతో కలిసి యువతలో శాస్త్రీయమైన ఆలోచనలను పెంచిన ఘనత కూడా వీరికే దక్కుతుంది. హేతువాద, మానవవాద, నాస్తికవాదాల గురించి 100కు పైగా ప్రామాణిక రచనలు చేశారు.

ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళటానికి పత్రిక అవసరం గుర్తించి ‘హేతువాది’ మాసపత్రికను స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నలభై ఏళ్లుగా సంపాదకులుగా వ్యవహరిస్తూ పత్రికను నిరాటంకంగా నడుపుతున్నారు. 76 ఏళ్ల క్రితం 1946లో ‘విశ్వాన్వేషణ’తో రచనా ప్రస్థానం ప్రారంభించి ఫిబ్రవరి 9, 2022న ఆవిష్కరిస్తున్న ‘లోకాయత చార్వాకం’తో 109 రచనలు చేసిన శతాధిక గ్రంథకర్తగా సరికొత్త రికార్డును సృష్టించారు వందేళ్ల రావిపూడి. (Bharat Bhushan: ఆదర్శ జీవితానికి కొలమానం)

తెలుగునాట వందలమందిని శిష్యులుగా, ఉద్యమాభిమానులుగా తీర్చిదిద్దారు. హేతువాదులు సమాజహిత వాదులని నిరూపించారు. మానవతావాదం కంటే మానవవాదం ముఖ్యమనే సరికొత్త భావజా లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. మూక ఉద్యమాలు, మూస ఉద్యమాలు ప్రజల్లో మాస్‌ హిస్టీరియాను పెంచుతాయనీ, హేతువాద, మానవవాదాలు ప్రజలను ఆలోచనా మార్గంలో నడుపుతాయనీ అంటారు రావిపూడి. మాస్టారును పద్మశ్రీలు వరించక పోవచ్చు. ఆయనకు గౌరవ డాక్టరేట్లు రాకపోవచ్చు. కానీ వందేళ్ల ఆయన అలుపెరుగని జీవితం సమాజానికి తరగని ఆస్తి. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ! (Bhimsen Joshi: శతవసంత స్వరమాధురి)

– బీరం సుందరరావు
హేతువాద ఉద్యమ నాయకులు
(నేడు రావిపూడి వేంకటాద్రి 101వ జన్మదినోత్సవం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top