స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఊరట: బ్రెయిన్‌ కేన్సర్‌తో సంబంధం లేదు! | WHO backed study says No link between mobile phones and brain cancer | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఊరట: బ్రెయిన్‌ కేన్సర్‌తో సంబంధం లేదు!

Sep 4 2024 3:57 PM | Updated on Sep 4 2024 4:21 PM

WHO backed study says No link between mobile phones and brain cancer

స్మార్ట్‌ఫోన్‌ వాడకంతో బ్రెయిన్‌ కేన్సర్‌ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం.  సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్‌ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి  సంబంధం లేదని తేల్చి చెప్పింది.  

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్‌  పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్‌ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్‌ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్‌లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్‌లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది.  సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు  అధ్యయనం పేర్కొంది.  

కాగా  డబ్ల్యూహెచ్‌ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్‌లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ  ఆసక్తికరంగా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement