తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే | UK telecom company launches AI powered grandma Daisy to tackle scammers | Sakshi
Sakshi News home page

తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే

Nov 16 2024 3:59 PM | Updated on Nov 16 2024 3:59 PM

UK telecom company launches AI powered grandma Daisy to  tackle  scammers

అదిగో  గిప్ట్‌, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్‌ కాల్స్‌తో జరుగుతున్న  సైబర్‌నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్‌,  టాక్స్‌ అంటూ  డిజిటల్‌ అరెస్ట్‌ల పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు.  ఇలాంటి   కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు   ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే  ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్‌బాట్ కాదు, లైఫ్‌లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన  ఏఐ అని కంపెనీ ప్రకటించింది.

బ్రిటన్‌లోనూ ఇలాంటి మోసాలు, ఆన్‌లైన్ స్కామర్ల  స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది  సైబర్‌ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట.  వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది.  ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్‌లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో  తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్‌లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్‌ పడుతుందని కంపెనీ తెలిపింది.  తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.

మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్‌ చేసేవారికి ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని  తెలుసుకుంటుంది.   అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం  స్కామ్‌లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.

మరోవైపు  ఓ2  కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్‌లను అడ్డుకునేందుకు  జాతీయ టాస్క్‌ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ  విభాగం కావాలని కూడా  కోరుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement