సగమైన సముద్రం | Spiritual Story About Selfishness | Sakshi
Sakshi News home page

సగమైన సముద్రం

Jun 16 2025 9:38 AM | Updated on Jun 16 2025 10:18 AM

Spiritual Story About Selfishness

ప్రతీకాత్మక చిత్రం

 ఆధ్యాత్మికథ 

తుంగభద్ర నది ప్రవహిస్తోంది. దూరంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అష్టోత్తరం వీనుల విందుగా వినిపిస్తూ ఉంది. నది ఒడ్డున కూర్చుని ఉన్న గురువుతో శిష్యుడు ‘‘స్వార్థం అంటే ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘స్వార్థం అంటే తన గురించి మాత్రమే శ్రద్ధ వహించడం. ఇతరులను పట్టించుకోకుండా తన ప్రయోజనం, ఆనందం లేదా సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించడం’’ అని బదులిచ్చాడు గురువు. ‘‘దాని పర్యవసానాలు ఏమిటి?’’ అని మళ్ళీ  ప్రశ్నించాడు శిష్యుడు. ‘‘స్వార్థం ఎంత పనైనా చేయిస్తుంది. దానికి అంతమనేది లేదు.   నీకు అర్థమయ్యే రీతిలో ఒక ΄కతకథ చెబుతాను విను.

‘‘ఒక పెద్ద సామ్రాజ్యంలోని రాజ్యాలలో వర్షాలు లేక తీవ్రమైన కరువు ఏర్పడింది. ఏమి చేయాలో తెలియని చక్రవర్తి ఆస్థాన పండితులను పిలిచి చర్చించాడు. తపస్సు చేసి దైవానుగ్రహం  పొందటమే శరణ్యమని వారు సలహా ఇచ్చారు. రాజ్యాల శ్రేయస్సు కోసం అడవులకెళ్ళి ఘోర తపస్సు ప్రారంభించాడు. చక్రవర్తి తపస్సుకి దేవుడు  ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు.  

ఇదీ చదవండి: Today recipes : బ్రెడ్‌తో ఇన్ని వెరైటీలు ఎపుడైనా ట్రై చేశారా?

తన సామ్రాజ్యంలో మంచివానలు కురవాలని, నీటికరువు ఉండకూడదని కోరాడు చక్రవర్తి. ఎందుకైనా మంచిదని తన సామ్రాజ్యానికి ఆనుకుని ఉన్న సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చివేయమని అడిగాడు. ‘‘ఆలోచించే అడుగుతున్నావా?’’ అని దేవుడు రాజును ప్రశ్నించాడు.‘‘వృథాగా ఉన్న సముద్రం నీళ్ళు మంచినీళ్ళుగా మారితే మా సామ్రాజ్యంలోని ప్రజలు తరతరాలు నీటి ఎద్దడి లేకుండా సుఖపడతారు కదా. చరిత్రలో నా పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా’’ అని దేవుణ్ణి ఒప్పించాడు.

చదవండి: ‘మై లవ్‌..’గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్‌ వీడియో

‘‘సరే, నీ ఇష్టం’’ అని చక్రవర్తి కోరినట్లే చేశాడు దేవుడు. వెంటనే మంచి వర్షాలు కురిశాయి. పరమానంద భరితుడయ్యాడు చక్రవర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ఉప్పునీళ్ళ సముద్రం మంచి నీళ్ళుగా మారాక పరిస్థితి ఎలా ఉందో చూద్దామని చక్రవర్తి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. సముద్రం సగమై ఉంది. ఆశ్చర్యపోయాడు. అలలు సైతం నీరసంగా పడి లేస్తున్నాయి. చక్రవర్తి గుండె తరుక్కుపోయింది. కారణమేమిటని తన సిబ్బందిని అడిగాడు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం రాజులు అవసరం ఉన్నా లేకున్నా సముద్రం నీళ్ళని తమ రాజ్యాల వైపుకు మళ్ళించుకున్నారని చెప్పారు. 

‘సముద్రాన్ని కూడా సగం చేసింది కదా మనిషి స్వార్థం’ అని తల పట్టుకున్నాడు చక్రవర్తి. ఇంకొన్నాళ్ళు గడిస్తే సముద్రం పూర్తిగా మాయమై పర్యావరణ సమస్య వస్తుందని గుర్తించాడు. వెంటనే తపస్సు ప్రారంభించడంతో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చేసిన తప్పునకు క్షమాపణలు కోరి సముద్రాన్ని ఉప్పునీళ్ళగా మార్చమని ప్రాధేయపడ్డాడు’’ అని స్వార్థం గురించి  వివరించాడు గురువు. స్వార్థం మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తుందని అర్థం చేసుకున్నాడు శిష్యుడు.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement