కథాకళి
‘‘మీ అల్లుడికి హిమాచల్ప్రదేశ్లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది.
‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు.
సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.
‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్ప్రదేశ్లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’
తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.
‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.
రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.
∙∙
సుధీర భర్త కొత్త బ్రాంచ్లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.
‘‘అది నిజమా?’’
‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’
∙∙
చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.
రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.
‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.
తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ముందుగా పోలీసులు అతని బ్రాంచ్కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.
మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.
‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’
‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది.
ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.
‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’
‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు.
‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు.
‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది.
‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’
కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు.
‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది.
‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు.
తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.
‘‘ఏమండీ? ఉన్నారా?’’
పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు.
పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.
‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు.
‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి


