లైవ్ కాన్సర్ట్ ఆల్బమ్
‘ఆల్ హార్ట్స్’ మ్యూజికల్ టూర్
లాస్ ఏంజిల్స్లోని ప్రసిద్ధ డాల్బీ థియేటర్ స్టేజ్పై పెర్ఫామ్ చేసిన ఏకైక భారతీయ సింగర్
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ సరికొత్త రికార్డుకు సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక ‘లైవ్ కాన్సర్ట్ ఆల్బమ్’ను విడుదల చేయబోతున్నట్లు సోనీ మ్యూజిక్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఆమె ప్రపంచవ్యాప్తంగా పూర్తి చేసిన ‘ఆల్ హార్ట్స్’మ్యూజికల్ టూర్ విశేషాలతో ఈ ఆల్బమ్ను రూపొందించారు.
ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల్లో జరిగిన ఈ మ్యూజికల్ టూర్లో.. ముంబై, లండన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్ వంటి ప్రముఖ నగరాల కాన్సర్ట్ స్టేజీలపై శ్రేయ లైవ్గా పాడిన ఐకానిక్ సాంగ్స్ను ఇందులో చేర్చారు. ఈ ఆల్బమ్లో శ్రేయా ఘోషల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన బాలీవుడ్ పాటలు ఉండబోతున్నాయి.
ఈ మ్యూజికల్ టూర్లో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత ఓవో ఎరీనా వెంబ్లీ, కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఎరీనాల్లో శ్రేయ ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా డెట్రాయిట్లోని ‘ఫాక్స్ థియేటర్’లో గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత ప్రదర్శన ఇచ్చిన రెండో భారతీయ కళాకారిణిగా శ్రేయా ఘోషల్ చరిత్ర సృష్టించారు. అలాగే లాస్ ఏంజిల్స్లోని ప్రసిద్ధ డాల్బీ థియేటర్ స్టేజ్పై పెర్ఫామ్ చేసిన ఏకైక భారతీయ సింగర్గా ఆమె రికార్డు సాధించారు.


