అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా! | Sagubadi: Health Tips: What Is Jujube Fruit Nutrition Benefits and Uses | Sakshi
Sakshi News home page

అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!

Jun 5 2026 10:51 AM | Updated on Jun 5 2026 10:51 AM

Sagubadi: Health Tips: What Is Jujube Fruit Nutrition Benefits and Uses

ఈ అడవి పండుకు ఇంగ్లీష్‌ పేరు: వైల్డ్‌ జుజుబె. తెలుగు పేర్లు: గొట్టె తీగ, పిండి పరిఘము, ఆనె పరిగె, తెల్ల పరిగె. అస్సామీస్‌: బిధావో భోగారి, బోన్‌ బాగరి, బోన్‌ బొగోరి, డిండవో బోగన్‌. ఒరియా: తినకోలి. కన్నడ: కట్టిలండల్, బేలహదు, బిళీముళ్ళిహను, కనిక, కొట్ట ముల్లుహణ్ణు.
గుజరాతీ: తోరన్‌. తమిళం: కట్టిలండల్, తోతరి, తోటన. మలయాళం: జాలి, కొట్టముళ్ళు, తొడలి, తుటరి, మలంతుటలీ. మరాఠీ: తురన్, తోరణ.   హిందీ: చూర్ణ, సూరన్‌.    సంస్కృతం: ఘంటా అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది. 

ఇది జిట్ట రేగు కుటుంబానికి చెందినది. దీనికి కూడా ముండ్లు కురచగా జంటగా కానీ ఒంటరిగా కానీ ఉంటాయి. తెల్ల పరిగె దాదాపు 5–7 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. మానుకు దగ్గరలో వేరే చెట్టు ఉంటే దాని సహాయంతో తీగలా కూడా పెరుగుతుంది. రేగు చెట్టులా ఇది కూడా ఆకులు రాల్చుతుంది. పండ్లు తెల్లగా ఉండి, అడుగు భాగాన కొద్ది నాటి కాషాయం రంగు ఉంటుంది. పండ్లు తెల్లగా ఉన్నందున దీనికి చెంచులు ‘తెల్ల పరిగె’ లేక ఆనె పరిగె అని పిలుస్తారు.

థాయిలాండ్‌లో దీని ఉనికి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్‌ తదితర దేశాల్లోని ఉష్ణ మండల అడవుల్లో పెరుగుతుంటాయి. భారతదేశంలో మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్‌ బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్‌–నికోబార్‌ దీవుల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని నల్లమల అడవులలో అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లాపూర్, కుడిచింత బయలు మొదలగు ప్రాంతాలలో గమనించవచ్చు. అక్కడి చెంచుల అభిప్రాయం మేరకు ఈ చెట్లు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. వీటిని అభివృద్ధి పరిచే అవసరం ఎంతైనా ఉంది.

ఆనె పరిగె పండు ఉపయోగాలు
పండ్లు తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పండులో గుజ్జు కొంత వరకు పిండిగా ఉండి రుచికరంగా ఉండటం వలన చెంచులు ఈ పండ్లను బాగా ఇష్ట పడుతారు. జీవాలు వీటి ఆకులను బాగా ఇష్టపడతాయి. పంటపొలం చుట్టూ తెల్లపరిగె కొమ్మలను కంచెగా వేసుకొని పశువులు ఇతర జంతువుల నుండి పంటను కాపాడుకోవచ్చు. రాలిన పండ్లను ఉడుతలు, కుందేళ్లు ఇతర జంతువులు ఇష్టంగా తింటాయని చెంచులు అన్నారు.

తెల్ల పరిగెను 
చెంచులు, ఇతరులు అనేక రోగాలను నయం చేయటానికి వాడుతారు. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, రక్తపోటు మొదలైన వాటికి వాడతారు.

ఈ పండులో ఉన్న ఔషధ, పోషక గుణాలు ఉన్నందు వల్ల పోషక లోపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఆ పండ్లలో కూడా ఇతర పంటల్లో మాదిరిగానే చక్కెర, కొవ్వు, పీచు మొదలైన పదార్ధాలు ఉంటాయి. పోషకాల విశ్లేషణ ఈ పట్టికలో పొందుపరిచాం...

పండ్లు: మార్చ్‌ – ఏప్రిల్‌ నెలలోకాస్తాయి. 5–7 మీటర్ల ఎత్తు పెరుగుతుంది

డాక్టర్‌ మొరుపోజు పద్మయ్య,
విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, 
ఐసీఏఆర్‌ – ఐఐఓఆర్, 
రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
మొబైల్‌: 94407 08924 

(చదవండి: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్‌ ప్లాన్‌..)

Advertisement
 
Advertisement
Advertisement