
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది.
ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.
రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్లోని 79వ యుఎన్జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు.
ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది.
ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్