వసతులు కరువు.. చదువులు బరువు     | lack of education facilities in mumbai schools | Sakshi
Sakshi News home page

వసతులు కరువు.. చదువులు బరువు    

May 26 2025 10:17 AM | Updated on May 26 2025 10:22 AM

lack of education facilities in mumbai schools

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు దూరం అవుతున్న 30 వేల మంది పిల్లలు  

గ్రామీణ ప్రాంతాల్లో సమస్య తీవ్రం   చదువుకు దూరం అవుతున్న వారిలో బాలికలే అధికం

 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేని వైనం 

ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యం 

సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా 30,116 మంది పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నట్లు ఇటీవల విద్యా శాఖ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకు ప్రధాన కారణం అనేక పాఠశాలల్లో విద్యార్థులకు మౌలికసదుపాయాల కొరత ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాఠశాలకు స్వస్తి చెప్పిన విద్యార్థుల్లో అధిక శాతం బాలికలే ఉన్నారు. స్వచ్ఛమైన మరుగుదొడ్లు లేకపోవడం ఒక కారణమైతే కొన్ని పాఠశాలల్లో అసలు మరుగుదొడ్లే లేవనే ఆశ్చర్యకరమైన విష యం బయటపడింది. 5,373 పాఠశాలల్లో ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేదు. అదేవిధంగా 530 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. కొన్ని పాఠశాల ల్లో ఆడ పిల్లల కోసం స్వతంత్రంగా మరుగు దొడ్లు లేవు. అలాగే 5,127 పాఠశాలల్లో అసలు మరు గుదొడ్లు లేవనే విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో గత్యంతరం లేక పాఠశాల ప్రహరీ గోడకు అవతల ఆనుకుని ఉన్న దట్టమైన పొదల్లోకి లేదా పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక మంది పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పాఠశాలకు పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు.  

ప్రయత్నాలు ఘనం.. ఫలితం శూన్యం                 
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ధనవంతులతోపాటు అనేక మంది పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోంచి డ్రాపౌట్‌ అవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోసాగింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వ పాఠశాలను అందంగా తీర్చిదిద్డడం, మరగుదొడ్లకు మరమ్మతులు చేపట్టడం, తాగు నీరు, విద్యా బోధన మెరుగుపర్చడం ఇలా అనేక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరగలేదు. దీంతో ప్రతీ ఊరు, పల్లెటూర్లలో తిరిగి విద్యార్థులకు కౌన్సెలింగ్, తల్లిదండ్రులకు మార్గదర్శనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ప్రత్యేక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ కౌన్సెలింగ్, మార్గదర్శనం చేయడం ప్రారంభించారు. 

2023–24 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లని విద్యార్థుల సంఖ్య 33,470 ఉండగా అదే 2024–25లో ఈ సంఖ్య 30,116 చేరింది. దీన్ని బట్టి గత విద్యా సంవత్సరంలో 3,354 మంది విద్యార్థుల సంఖ్య మాత్రమే పెరిగిందని స్పష్టమవుతోంది. అంటే ఇంకా 30,116 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉంటున్నట్లు తేలింది. విద్యార్థులు ఖాళీగా తిరగడంవల్ల చెడు వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం లేకపోలేదు. నేరాలకు కూడా పాల్పడతారని విద్యా శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ సంఖ్య తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో చేపట్టిన కౌన్సెలింగ్, మార్గదర్శక కార్యక్రమాలవల్ల కొంతమేర సత్ఫలితాలు ఇవ్వవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైన తరువాత 2025–26లో ఎంతమేర విద్యార్థుల సంఖ్య పెరిగిందనేది తెలుస్తోంది. దీన్ని బట్టి పాఠశాలకు ఇంక ఎంతమంది దూరంగా ఉంటున్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుందని విద్యా శాఖ పేర్కొంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement