చిప్పలు చెప్పే కథ | Kerala Maria Kuriakose turned coconut waste into a brand | Sakshi
Sakshi News home page

చిప్పలు చెప్పే కథ

Jun 24 2026 12:47 AM | Updated on Jun 24 2026 12:47 AM

Kerala Maria Kuriakose turned coconut waste into a brand

వేసవొస్తే కొబ్బరి నీళ్లకు యమగిరాకీ ఉంటుంది. వీధి చివరన, హైవే రోడ్ల మీద, మార్కెట్‌ యార్డుల దగ్గర.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు ఎడాపెడా తాగేసి ఖాళీ చేసి పడేస్తాం. శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే తాగి పడేసిన ఖాళీ బోండాల గురించి మాత్రం ఆలోచించం. కాని కేరళకి చెందిన ఓ అమ్మాయి ఆలోచించింది. పనికిరాని చెత్త అనుకున్న కొబ్బరి చిప్పలను కళాకృతులుగా మలిచింది. ఉపయోగం లేదనుకున్నవాటినే ఉపాధిగా ఎంచుకుంది.  

బ్యాక్‌ టు హోం...
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మరియా కురియాకోస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీ పూర్తి చేయడానికి ముంబై వెళ్లింది. ఆ తర్వాత స్పెయిన్‌లో ఎంబీఏ చేసింది. కార్పొరేట్‌ రంగంలో రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత ఆమెకు ఏదైనా భిన్నంగా చేయాలి, ఏం చేసినా సొంతంగా గుర్తింపు పొందేలా ఉండాలి అని నిర్ణయించుకుంది. ప్రకృతి జీవవైవిధ్యాన్ని దెబ్బతీయకుండా సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా వ్యాపారం చేయాలని తన స్వస్థలానికి చేరుకుంది.

‘తేంగా కోకో’ ప్రారంభం...
తొలుత మరియా కొబ్బరి ఆకులతో చిన్నచిన్న ఉత్పత్తులను మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాపారం ఆశించినంతగా ప్రాచుర్యం పొందలేదు. కాని ఒకరోజు ఇంట్లో కొబ్బరి చిప్పలను చూసి ఒకదానిని తీసుకుని శుభ్రం చేసింది. సాల్ట్‌ పేపర్‌తో బ్రష్‌ చేసి దానిపై కాస్త ఆయిల్‌ వేసి రబ్‌ చేయగా ఆ కొబ్బరి చిప్ప ఓ కళాకృతిలా మరియాకి అనిపించింది. తన తండ్రికి చూపించగా ఆయన కూడా ‘వావ్‌’అనడంతో కొబ్బరి చిప్పల కళాకృతుల కోసం ‘తేంగా కోకో’ అనే సంస్థను 2019లో ప్రారంభించింది.

విదేశాలకు ఎగుమతి...
ప్రస్తుతం తేంగా కోకో ఉత్పత్తులు ఇటలీ, స్పెయిన్, బల్గేరియా, ఆస్ట్రేలియా, దుబాయ్‌ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. హోటళ్లు, రీసార్టులు, కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ సంస్థలు, రెస్టారెంట్లు ఈ కంపెనీ చెందిన సుమారు 110 రకాల ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ వార్షిక ఆదాయం రూ.3.5 కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాదికి ఈ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మరియ పేర్కొంది.  చిన్న ఆలోచనతో ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా... పర్యావరణానికి మేలు చేసే వ్యాపారం ఒకవైపు, సంప్రదాయ కళావృత్తులకు జీవం  పోసిన వైనం మరోవైపు... రెండింటినీ సాధించి చూపించిన మరియ ప్రతిభ ప్రశంసనీయమని సోషల్‌ మీడియా సాక్షిగా దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.          

మహిళలకు ఉపాధి
కొబ్బరి చిప్పలతో కళాకృతులు తయారుచేసే సంప్రదాయ కళాకారులు కేరళలో ఉన్నప్పటికీ, ప్లాస్టిక్, మెటల్‌ వస్తువుల రాకతో వారికి సరైన మార్కెట్‌ లేదు. దీంతో మరియా అలాంటివారిని వెతికి పట్టుకుంది. టీ కప్పులు, స్మూతీ బౌల్స్, సర్వింగ్‌ స్పూన్లు, ఇతర అలంకరణ వస్తువులను తయారుచేసేలా వారికి అవగాహన కల్పించింది. మెల్లగా తెంగా కోకో ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో మరింతమంది కళాకారులను చేరదీసి 2024లోపాలక్కాడ్‌ జిల్లా సరిహద్దులో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విషయమేమిటంటే ఇక్కడ పని చేసేవారంతా మహిళలే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement