
ఇవి..అవి..అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిత్యం పిల్లలు అనేక రూపాల్లో శారీరక, లైంగిక, మానసిక హింసను ఎదుర్కొంటున్నారు.వారిని రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి... మొదలైన విషయాలను అవగాహన పరిచే రోజు... సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే రోజు...ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’...
పద్నాలుగు సంవత్సరాల వయసులో రోషిణి పర్వీన్కు వివాహం జరిగింది. పదిహేను సంవత్సరాలకే తల్లి అయ్యింది. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో రోషిణి పడిన బాధలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇన్నీ అన్నీ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తనలా ఏ అమ్మాయీ బాధ పడకూడదు అనుకొని ముందుకు కదిలింది.ఇప్పటివరకు అరవైకి పైగా బాల్య వివాహాలు జరగకుండా అడ్డుకుంది.
ఆ పిల్లలను మళ్లీ బడి బాట పట్టించి వారి భవిష్యత్ను వెలుగుమయం చేసింది. ఒకప్పుడు ‘నేను ఒంటరిని’ అనుకున్న బిహార్లోని సిమల్బరీ గ్రామానికి చెందిన రోషిణి ‘చైల్డ్లైన్ ఇండియా ఫౌండేషన్’లో చేరడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ‘నేను ఒంటరిని కాదు. నాతో మరెంతోమంది ఉన్నారు’ అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే ప్రాణాలకు తెగించి బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకుంది.
‘సేవ్ ది చిల్డ్రన్’లాంటి సంస్థలలో పని చేసిన రోషిణి ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే సమస్యల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నో స్కూల్స్లో ‘గర్ల్స్ గ్రూప్’లను ఏర్పాటు చేసింది. బిహార్లోని రోషిణి పర్వీన్ నుంచి శ్రీకాళహస్తిలోని వైశాలి వరకు ఎంతోమంది మహిళలు పిల్లల హక్కులు, భద్రత గురించి క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
క్షేత్రస్థాయిలోకి...
‘కొంతమంది స్నేహితులు, న్యాయవాదుల సహాయంతో బుక్లెట్ రూపొందించాను. మా అబ్బాయితో మొదట దీని గురించి మాట్లాడాను. సేఫ్ ఇండియా, హ్యాపీ ఇండియా క్యాంపెయిన్ మొదలు పెట్టి పిల్లల భద్రత గురించి ప్రచారం చేశాం. కరపత్రాలు పంచాం’ అంటుంది వైశాలి కోలా.పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడానికి శ్రీకాళహస్తిలో‘తేజోభారత్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది వైశాలి.
‘ఏదైనా నేరం జరిగితే దానిగురించి కాసేపు మాట్లాడుకొని బాధ పడతారు. ఆ తరువాత మరచి పోతుంటారు. కొందరు మాత్రం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర లేని రాత్రులు గడుపుతుంటారు. అలాంటి వారు కూడా ఏదైనా చేద్దాం అంటే ముందుకు రారు.
పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ రకాల ప్రమాదాల గురించి అవగాహన కలిగించడానికి స్వరక్ష ఏర్పాటు చేశాం’ అంటుంది కేరళలోని కోచికి చెందిన అనూ సూరజ్. ‘స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థ పిల్లలపై జరిగే భౌతిక, లైంగిక, మానసిక హింస గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలకు తెలియజేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.
ఎందుకు ఈరోజు?
ప్రతి సంవత్సరం జూన్ 4న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రేషన్’ జరుపుకుంటారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆగస్ట్ 19, 1982లో మొదలైంది. మొదట్లో యుద్ధ బాధితులైన లెబనాన్, పాలస్తీనా పిల్లలపై దృష్టి పెట్టినప్పటికీ తరువాత దీని ఉద్దేశాన్ని విస్తృతీకరించారు. పిల్లలు రకరకాల రూపాల్లో ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి, వారి హక్కులను కాపాడడానికి పరిష్కార మార్గాలు, కార్యాచరణ ప్రణాళిక గురించి ఆలోచించడమే ఈ రోజు ఉద్దేశం.
ఫన్నీగానే సీరియస్ విషయాలు
బ్యాడ్ టచ్, గుడ్ టచ్ పిల్లలు గుర్తించేలా చేయడానికి, ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి, అంతర్గత శక్తిని పెంచడానికి ఆడియో–విజువల్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాం. ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నాం. కథలు, ఫన్ వీడియోల ద్వారా చిన్న పిల్లలకు సీరియస్ విషయాల గురించి తెలియజేస్తున్నాం. ‘మాయ’ అనే షార్ట్ ఫిల్మ్ను కూడా రూపొందించాం. పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రకరకాల ఏజ్ గ్రూపుల ఆధారంగా పిల్లలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం,
– అనూ సూరజ్, స్వరక్ష చారిటబుల్ ట్రస్ట్
చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు
‘చైల్డ్ మ్యారేజ్–ఫ్రీ ఇండియా’ అనేది నా లక్ష్యం. నాది బాల్య వివాహం కావడంతో ఎన్నో కష్టాలు పడ్డాను. సమస్యలు ఎదుర్కొన్నాను. నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికీ రాకూడదనుకున్నాను. గ్రామాల్లో ‘చైల్డ్ ప్రొటెక్షన్’ కమిటీలు ఏర్పాటు చేశాం. అవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘మీ హక్కులు ఇవి’ అంటూ పిల్లలకు అవగాహన తరగతులు నిర్వహించాం.
– రోషిణి, సామాజిక కార్యకర్త
ఎన్నెన్నో రూపాల్లో..
పిల్లల్ని పనిలో పెట్టుకొని వారి భవిష్యత్ను చీకటిమయం చేసే, పిల్లల్ని అపహరించి అమ్ముకునే, పిల్లల్ని అపహరించి వ్యభిచార కూపాల్లోకి దింపే సంఘటనలు ఒకవైపు... మరోవైపు యుద్ధాలలో చని΄ోతున్న పిల్లలు. యుద్ధ భీభత్సానికి బా«ధితులు అవుతున్న పిల్లలు. ఇంట్లో తల్లిదండ్రుల తగాదాలకు మానసికంగా దెబ్బతింటున్న, అయిన వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు.
(చదవండి: వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరేం కాదు!)