
లష్కర్ బోనాల పండుగ అనగానే కొత్త కుండలో ప్రత్యేకంగా వండిన ప్రసాద నైవేద్యం.. డప్పుల దరువులు.. పోతురాజుల వీరంగాలు.. ఫలహారపు బండ్ల ఊరేగింపులు.. రంగం ద్వారా భవిష్యవాణి వినిపించడం.. ఎక్కువగా ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. జాతరలో ప్రతి ఇంటికీ వెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఘటం అత్యంత కీలకమైనది. ఈ నెల 29న ఆదివారం అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 29 నుంచి జులై 12 వరకూ అమ్మవారి ఘటం భక్తులకు దర్శనం కోసం సికింద్రాబాద్ పురవీధుల్లో ఉరేగిస్తారు.
అమ్మవారి ఘటాన్ని పొడవైన వెదురు బద్దలతో నిలువెత్తు ఆకారంతో.. పూలతో అందంగా తీర్చిదిద్దుతారు. నడుమ అమ్మవారి విగ్రహాన్ని అమర్చి ఆకర్షణీయంగా రూపొందించేదే ఘటం. ఒంటినిండా పసుపు పూసుకున్న వ్యక్తులు ఘటాన్ని అధిరోహించి.. తలపై ఉన్న ఘటం కిందపడకుండా డప్పుల వాద్యాలకు, దరువులకు అనుగుణంగా విన్యాసాలతో నాట్యమాడతారు.
సాధారణంగా కనికట్టు విద్యలు చేసే వారు ఇటువంటి వాటిని ప్రదర్శించినా.. సుమారు 60 కిలోల బరువుతో కూడిన ఘటాన్ని కేవలం పసుపు ముద్ద.. తలచుట్టకు మధ్యన పెట్టి పడకుండా చూడాల్సి ఉంటుంది. సికింద్రాబాద్లో 15కు పైగా ఆలయాలకు సంబంధించిన అమ్మవారి ఘటాలు ఈ రకంగా 13 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాయి.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల వేడుకలు జులై 13 ఆదివారం బోనాలు, 14న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లష్కర్ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఎదుర్కోలు నుంచి జాతర ముగిసే వరకూ..
ఆషాఢమాసం తొలి ఆదివారం ఈ నెల 29వ తేదీ ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొంటుంది. అదే విధంగా సోమసుందరం వీధిలోని శ్రీ దేవి పోచమ్మ, కళాసిగూడలోని మాతా ముత్యాలమ్మ, శివాజినగర్లోని డొక్కలమ్మ, రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ, ఓరుగంటి ఎల్లమ్మ, సెకెండ్ బజార్లోని ముత్యాలమ్మ, పీనుగుల మల్లన్న, కుమ్మరిగూడలోని నల్లపోచమ్మ, ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ వంటి అమ్మవారి ఘటాలు కూడా ఎదుర్కోలు ఉత్సవాల్లో వేర్వేరుగా పాల్గొంటాయి.
ప్రధానంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఘటం బోట్స్క్లబ్ సమీపంలోని బుద్ధభవన్ ఎదురు వీధిలో ఉన్న మహంకాళమ్మ దేవాలయంలో రూపుదిద్దుకుంటుంది. ఆ తరువాత జులై 12 శనివారం రాత్రి వరకూ ఆయా బస్తీలు.. కాలనీల్లో ఊరేగుతూ భక్త జనుల పూజలు అందుకుంటాయి. 13 ఆదివారం బోనాల పండుగ రోజున ఉజ్జయిని మహాకాళి మినహా ఇతర ఘటాలు ఆనకట్ట ఉత్సవాల్లో పాల్గొంటాయి. 14వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం ముగిసిన తరువాత అమ్మవారి ఘటం వీడ్కోల ఉత్సవంలో పాల్గొంటుంది. దీంతో జాతర ముగుస్తుంది.
ఘటం మొదలైంది ఇలా..
తొలినాళ్లలో ఘటం అనేది ఉండేది కాదు. ప్రధానంగా 1813లో సురిటి అప్పయ్య అనే మిలటరీ ఉద్యోగి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో విధులు నిర్వహించేవారు. ఆ సమయంలో నగరంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
కలారా వ్యాధి తగ్గితే.. సికింద్రాబాద్లో ఆలయాన్ని కడతానని మొక్కుకున్నారు. అనంతరం సికింద్రాబాద్లో ఆషాఢంలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఆషాఢమాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేందుకు అమ్మవారి ఘటాన్ని మొదలుపెట్టారు.
ఘటం అధిరోహకుల వేషధారణ..
ఘటం అధిరోహకులు కూడా ఘటం మాధిరిగా ప్రత్యేకంగా తయారవుతారు. ముఖ్యంగా పసుపులో తడిపిన పంచె ధరించి.. ఒంటి నిండా పసుపు పులుముకుని కళ్లకు కాటు.. కాళ్లకు గజ్జెలు ధరించి అమ్మవారి ఘటాన్ని అధిరోహిస్తుంటారు. వేపాకులతో కూడిన చన్నీళ్ల సాకతో ఘటం అధిరోహకుల కాళ్లను భక్తులు కడిగి మొక్కుతారు.
(చదవండి: Telangana Bonalu : తెలంగాణ బోనం.. సాంస్కృతిక ప్రయాణం..)